
- అకడమిక్ ఇయర్ వృథా అయ్యిందని ఆవేదన
- బాధిత స్టూడెంట్లపై పోలీసుల లాఠీచార్జి
ఇబ్రహీంపట్నం, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీ ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం ఆందోళనకు దిగారు. వర్సిటీ పేరిట 4000 మంది స్టూడెంట్లను 2022 -విద్యా సంవత్సరంలో జాయిన్ చేసుకొని ఇప్పటికీ పరీక్షలు నిర్వహించలేదని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొంటూ ధర్నాకు కూర్చున్నారు. వారికి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. యూనివర్సిటీగా మారిందని చెప్పడంతో లక్షలు కట్టి తమ బిడ్డల్ని జాయిన్ చేశామని చెప్పారు. ఎగ్జామ్స్ నిర్వహించకపోవడంతో ఒక అకడమిక్ ఇయర్ వృథా అయ్యిందని వాపోయారు. వేరే యూనివర్సిటీల్లో జాయిన్ అవ్వాలన్నా ప్రస్తుతం అడ్మిషన్లే లేవని చెప్పారు. అనుమతి లేకుండానే యూనివర్సిటీగా ప్రకటించుకుని.. ఎందుకు విద్యార్థులను జాయిన్ చేసుకున్నారో తెలపాలని గురునానక్ మేనేజ్ మెంట్ను నిలదీశారు.
ప్రభుత్వ అండను ఉపయోగించి పోలీసులతో తమపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. గురునానక్ మేనేజ్మెంట్ తమకు న్యాయం చేసేవరకు నిరసన ఆపేదిలేదని బాధితులు స్పష్టం చేసారు. విద్యార్థులకు న్యాయం చేయాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో విద్యార్థులను, తల్లిదండ్రులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. దాంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. బల్మూరి వెంకట్తో సహా పలువురిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు.