
కోరుట్ల, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోరుట్లలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. కోరుట్ల–వేములవాడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఏండ్లుగా హాస్టల్లో సరైన వసతులు, సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
50 మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో రెండే బాత్రూంలు ఉన్నాయని, వాటికి తలుపులు కూడా లేవన్నారు. కాలేజీలో బోధించేందుకు సరైన ఫ్యాకల్టీ లేరని, యూనివర్సిటీ గుర్తింపు ఉందో లేదో అని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సమస్యలు పరిష్కరించేదాకా కదిలేది లేదని సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కోరుట్ల నుంచి వేములవాడ
జాతరకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను సముదాయించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్శ్రీలత వచ్చి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.