
చదువుకునే విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సంస్థలు స్కాలర్షిప్స్ అందిస్తున్నాయి. ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ దాకా ప్రతి దశలో కొన్ని సంస్థలు స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. ఇంటర్ పూర్తి చేసి, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చేయాలనుకునే స్టూడెంట్స్కు ఉపకారవేతనాలు అందిస్తున్న సంస్థల గురించి తెలుసుకుందాం..
ఎల్ అండ్ టీ బిల్డ్ ఇండియా స్కాలర్షిప్
ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని ఎంటెక్ చేయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎల్ అండ్ టీ బిల్డ్ ఇండియా స్కాలర్షిప్ అందిస్తోంది. ఎంపికైన విద్యార్థులు ఐఐటీ చెన్నై, ఐఐటీ ఢిల్లీ, ఎన్ఐటీ సూరత్కల్, ఎన్ఐటీ తిరుచ్చిలోనే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో ఎంటెక్ చేయాలి. ఇన్స్టిట్యూట్స్కు సంబంధించిన ఫీజుతో పాటు విద్యార్థులకు నెలకు రూ.13,400 అందజేస్తుంది.
అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో బీటెక్ (సివిల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి. షార్ట్లిస్టు చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ చేసి ఫైనల్గా ఎంపిక చేస్తారు. స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
వెబ్సైట్: www.intecc.com
ఎల్ఐసీ చేయూత
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఏటా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) స్కాలర్షిప్స్ అందిస్తోంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై, కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష మించరాదు.
సెలెక్షన్: పదోతరగతి, ఇంటర్ మార్కులు, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎంపిక చేస్తారు. దేశ వ్యాప్తంగా ఒక్కో ఎల్ఐసీ డివిజినల్ సెంటర్ నుంచి 20 మందికి ఇస్తారు. ఎంపికైన విద్యార్థికి ఏటా రూ.20 వేలు చెల్లిస్తుంది.
వెబ్సైట్: www.licindia.in
దివ్యాంగులకు ‘సాక్షం’
స్పెషల్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సాక్షం స్కాలర్షిప్ అందిస్తోంది. డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన దివ్యాంగులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: డిజిబిలిటి 40 శాతం లేదా అంతకు మించి ఉండాలి. ఆదాయం రూ.8 లక్షలు మించరాదు. మెరిట్ ఆధారంగా రూ. 50 వేల స్కాలర్షిప్ ఇస్తారు.
వెబ్సైట్: www.aicte-india.org
ఒన్లీ ఫర్ గర్ల్స్
డిప్లొమా, ఇంజినీరింగ్ చదువుకునే విద్యార్థినులకు ఆర్థిక చేయూతనివ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మొత్తం ఐదువేల ప్రగతి స్కాలర్షిప్స్ అందజేస్తుంది.
అర్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ / డిప్లొమా ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందిన వారు అర్హులు. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు బాలికలకు మాత్రమే ఇస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించరాదు. నాలుగేండ్లలో రూ.50 వేలు చెల్లిస్తారు. నవంబర్ 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్: www.aicte-india.org
మెరిట్ స్కాలర్షిప్
పేద మైనారిటీ విద్యార్థులు ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చేయడానికి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ దేశ వ్యాప్తంగా 60వేల మందికి అందిస్తున్నారు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో టెక్నికల్ డిగ్రీ/ పీజీ చేస్తున్న విద్యార్థులు అర్హులు. వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించరాదు. ప్రతి ఏడాది రూ. 20 వేలు అందజేస్తారు.
వెబ్సైట్: scholarships.gov.in