
- దేవాదాయ శాఖ కమిషనర్ఆదేశాలు వివాదాస్పదం
- టెండర్ సొమ్ము చెల్లించడం లేదని మే నెల నుంచి తలనీలాలు అప్పగింత నిలిపేసిన అధికారులు
- తలనీలాలకు సంబంధించి రూ.9.50 కోట్లు బకాయిలు..
- రెండు రోజుల కింద రూ.2.5కోట్లు చెల్లిస్తే రూ.5కోట్ల విలువైన తలనీలాలు అప్పగింత
వేములవాడ, వెలుగు: బకాయిపడ్డ కాంట్రాక్టర్కే రాజన్న తలనీలాల స్టాక్ను అప్పగించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే సదరు కాంట్రాక్టర్ గత మే నెల నుంచి టెండర్ సొమ్ము చెల్లించడం లేదని తలనీలాలు స్టాక్ను అప్పగించడం నిలిపివేశారు. రెండు రోజుల కింద దేవాదాయ కమిషనర్ నుంచి ఆ కాంట్రాక్టర్కు తలనీలాలు అప్పగించేందుకు ఆర్డర్స్ ఇష్యూ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
8నెలలుగా తలనీలాలు అప్పగించట్లే.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తలనీలాల సేకరణ టెండర్ ఏపీలోని హిందూపురం పట్టణానికి చెందిన సుమితి ఎంటర్ ప్రైజెస్ సంస్థ దక్కించుకుంది. ఈ టెండర్ ప్రకారం.. రెండేండ్ల కాలానికి నెలకు రూ.79 లక్షలు చొప్పున మొత్తం సుమారు రూ.19కోట్లు ఆలయానికి చెల్లించాలి. దీని ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్ వరకు ప్రతినెలా టెండర్ సొమ్ము చెల్లించిన కాంట్రాక్టు సంస్థ ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో మే నెల నుంచి తలనీలాలు అప్పగించడాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు.
టెండర్ ఒప్పందం ప్రకారం.. రూ.9.5కోట్లు బకాయి ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీనిపై కాంట్రాక్టు సంస్థకు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదని ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఐదు చెక్ బౌన్స్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు. దీంతో గత మే నుంచి సేకరించిన భక్తులు సమర్పించే తలనీలాలను ఆ సంస్థకు ఇవ్వకుండా ఆలయ అధికారులే ఎప్పటికప్పుడు పోగు చేస్తున్నారు. ఆ తలనీలాలు పాడవకుండా పలుమార్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయ ఓపెన్ స్లాబ్లో ఆరబోసి, బస్తాల్లో భద్రపరిచారు.
కమిషనర్ ఆర్డర్స్పై విమర్శలు
రాజన్న ఆలయానికి సుమారు రూ.9.50 కోట్లు బకాయి ఉన్న కాంట్రాక్ట్ సంస్థకే పోగు చేసిన తలనీలాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆర్డర్స్ ఇవ్వడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఆర్డర్స్ ప్రకారం.. కాంట్రాక్టర్ సంస్థ టెంపుల్కు రూ.2.5కోట్లు చెల్లించగా.. రూ.5కోట్ల విలువైన తలనీలాలను రెండు రోజుల కింద అధికారులు అప్పగించారు. ఈ విషయంపై ఆలయ ఈవో వినోద్రెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వం ఆర్డర్స్ ప్రకారం తలనీలాలు అప్పగించామని చెప్పడం గమనార్హం.
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనేనని అనుమానాలు..
రాజన్న ఆలయ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వలేమని కాంట్రాక్టర్కు పలుమార్లు నోటీసులతో పాటు ఐదు సార్లు అతనికి చెక్ బౌన్స్ కేసులు కూడా పెట్టారు. ఈక్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో దేవాదాయ శాఖ అధికారులు కాంట్రాక్టర్కు వెసులుబాటు కల్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం.. డిసెంబర్ వరకు సేకరించిన తలనీలాలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు రాజన్న ఆలయ అధికారులు గత డిసెంబర్ వరకు పోగు చేసి 133 సంచుల్లో నిల్వ ఉంచిన స్టాక్ను అప్పగించారు. వీటి విలువ సుమారు రూ.5కోట్లు ఉండగా కాంట్రాక్ట్ సంస్థ రూ.2.5కోట్లే చెల్లించింది.
మిగతా సొమ్ముతో పాటు జనవరి నుంచి ఇప్పటిదాకా పోగు చేసిన తలనీలాలపై సందిగ్ధత నెలకొంది. మిగతా సొమ్ముతో పాటు ప్రస్తుతం నిల్వ ఉన్న తలనీలాలకు డబ్బు ఎవరు చెల్లిస్తారనేదానిపై ఆలయ అధికారుల్లో క్లారిటీ లేదు. కాగా ఈ తతంగమంతా ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే కాంట్రాక్ట్ సంస్థకు వెసులుబాటు కల్పిస్తూ కమిషనర్ నుంచి ఆర్డర్స్ఇప్పించినట్లు తెలుస్తోంది.