సమ్మర్​ యాక్షన్​ ప్లాన్ విద్యుత్​ ఓవర్​ లోడ్​ను తట్టుకునేలా ట్రాన్స్​ఫార్మర్లు

సమ్మర్​ యాక్షన్​ ప్లాన్ విద్యుత్​ ఓవర్​ లోడ్​ను తట్టుకునేలా ట్రాన్స్​ఫార్మర్లు
  • కొత్త సబ్ స్టేషన్లకు ప్రపోజల్స్
  • అందుబాటులోకి టోల్​ ఫ్రీ నంబర్

మహబూబ్​నగర్, వెలుగు: ఎండాకాలం ప్రారంభానికి ఇంకా నెల రోజుల టైం ఉంది. ఇప్పటి నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోత మొదలైంది. ఎండలకు గ్రౌండ్​ వాటర్​ కూడా క్రమంగా తగ్గుతోంది. దీంతో విద్యుత్​ డిమాండ్​ పెరిగింది. ఈ క్రమంలో ఓవర్​ లోడ్​ను తట్టుకొని నాణ్యమైన విద్యుత్​ సప్లై చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​ రెడీ చేశారు. లో వోల్టేజీ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు.

ముందస్తు చర్యలు..

విద్యుత్​ డిమాండ్​ పెరుగుతుండడంతో ట్రాన్స్​ఫార్మర్ల వద్ద ట్రిప్​ కావడం, కాలిపోవడం వంటి వాటికి చెక్​ పెట్టడంతో పాటు ఓవర్​ లోడ్​ను తట్టుకునేందుకు ఆఫీసర్లు సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​ రెడీ చేశారు. ఇందులో భాగంగా మహబూబ్​నగర్​ జిల్లాలో రూ.14.14 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్​ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపారు. 

రూ.4.94 కోట్లతో కొత్తగా 33 కేవీ లైన్​ను, రూ.1.84 కోట్లతో కొత్తగా 11 కేవీ విద్యుత్​ లైన్​ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ.. రూ.7.40 కోట్లతో అధిక సామర్థ్యం ఉన్న 9 కొత్త పవర్​ ట్రాన్స్​ఫార్మర్లు, రూ.3.05 కోట్లతో ఎక్కువ సామర్థ్యం ఉన్న 325 కొత్త డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ఫార్మర్లు సిద్ధం చేశారు. నారాయణపేట జిల్లాలో పవర్  ట్రాన్స్ పార్మర్స్  కోసం రూ.4 కోట్లు, 11 కేవీ లైన్  కోసం రూ.80 లక్షలు, 33 కేవీ లైన్ ఏర్పాటు కోసం రూ.30 లక్షలు, కొత్త డీటీఆర్​ ఏర్పాటుకు రూ.4.5 లక్షలతో ప్రణాళికలు రూపొందించారు.

అందుబాటులోకి టోల్​ ఫ్రీ నంబర్..​

కరెంట్​ సమస్యలను వీలైనంత స్పీడ్​గా పరిష్కరించేందుకు ఆఫీసర్లు మహబూబ్​నగర్​ జిల్లాలో 1912 టోల్​ ఫ్రీ నంబర్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి డివిజన్​ పరిధిలో ఒక కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించనున్నారు. జిల్లాకు ఒక మొబైల్​ వెహికల్​ను అందుబాటులోకి తెచ్చారు.

విద్యుత్​ వినియోగదారులు కరెంట్​ సమస్య వస్తే ఈ టోల్​ ఫ్రీ నంబర్​ కంప్లైంట్​ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆఫీసర్లు అలర్ట్​ అయి మొబైల్​ వెహికల్​తో స్పాట్​కు చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఈ మొబైల్​ వెహికల్​లో కరెంటు వైర్లు, ఫ్యూజులు, తాళ్లు, నిచ్చెనతో పాటు ట్రాన్స్​ఫార్మర్​ పాడైతే, కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి అదనపు ట్రాన్స్​ఫార్మర్​ అందుబాటులో ఉంటాయి.

సమీక్షలు.. సమావేశాలు..

ఎండాకాలం నేపథ్యంలో విద్యుత్  డిమాండ్​తో వచ్చే సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎమ్మెల్యేలు విద్యుత్​ శాఖ ఆఫీసర్లతో వారం రోజులుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. 33/11 కేవీ సబ్​ స్టేషన్ల పనితీరుపై ఇటీవల మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో జరిగిన సమీక్షలో ఉన్నతాధికారులు వివిధ అంశాలపై ఆరా తీశారు. అవసరం ఉన్న చోట కొత్త ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 11 కేవీ కరెంట్​ వైర్లపై ఓవర్​ లోడ్​ లేకుండా, ట్రాన్స్​ఫార్మర్లు అవసరమైన చోట మార్చేందుకు ప్రపోజల్స్​ పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.

పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి ఇటీవల కరెంట్​ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్  అందించాలని సూచించారు. మహబూబ్​నగర్​కు కొత్తగా వచ్చిన ట్రాన్స్​ఫార్మర్లను ఎండాకాలం ప్రారంభం కాకముందే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.