
టీ, కాఫీలు మానేసి... షర్బత్, మజ్జిగ .. చెరకు రసం తాగే రోజులు వచ్చేశాయి. వేసుకునే బట్టల్లో మార్పులు చేసుకోవడం మొదలుపెట్టే ఉంటారు. అలాగే తినే ఆహారంలోనూ తేడా వచ్చి ఉంటుంది. కాని చర్మ సంరక్షణలో మాత్రం జాగ్రత్తలు తీసుకోరు. అందంగా కనిపించడం మాత్రమే కాదు... చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఎండాకాలంలో స్కిన్ సేఫ్టీ ఎలాగో తెలుసుకుందాం.
వేసవికాలం ఎండలో కాసేపు తిరిగితే చాలు.... చర్మం కమిలిపోయి నల్లబడుతుంది. చర్మ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే, తిరిగి అనిగారింపు పొందటానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఎండా కాలంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువుగా ఉంటాయి. అందుకే చర్మాన్ని చాలా పదిలంగా చూసుకోవాలి. అలాగని పెళ్లిళ్లకు, పార్టీలకు వెళ్లకుండా ఉండలేరు కదా. ..! కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేకప్లో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే చాలు. మండు వేసవిలోనూ మిలమిలా మెరిసిపోవచ్చు.
లోషన్ సన్ స్క్రీన్
సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు ముఖంపై పడ్డప్పుడు చర్మం పాడవుతుంది. అందుకే స్క్రీన్ లోషన్ కచ్చితంగా ఉపయోగించాలి. ఎండకు వెళ్లేవాళ్లు అది రాసుకున్నాకే బయటికి వెళ్లాలి. అలాకాకుండా రోజంతా ఎందలోనే తిరగాల్ని వచ్చినప్పుడు.. ప్రతి రెండుగంటలకు ఒకసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఎంచుకునేటప్పుడు ఎస్పీఎఫ్-15 ఉన్న సన్ స్క్రీన్ తీసుకోవాలి. అంతకంటే తక్కువ ఎస్పీ ఎఫ్ ఉన్నది వాడొద్దు. దీన్ని కేవలం ముఖానికే కాదు.. చేతులు, కాళ్లు, మెడ, వీపు మొదలైన ఎండ పడే ప్రతి చోటా రాసుకోవాలి.
ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి
అన్ని కాలాల్లోనూ చర్మాన్ని కాపాడుకోవాలి.అయితే చెమట ఎక్కువగా పట్టే ఈ వేసవిలో చర్మాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. జిడ్డు చర్మం, మొటిమలు వంటి సమస్యలతో బాధపడేవాళ్లు.. రోజులో కనీసం మూడునాలుగుసార్లు ముఖాన్ని మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి అయితే ఆ సమయంలో సబ్బు, ఫేస్ వాష్ క్రీములు వాడాల్సిన అవసరం లేదు. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఫేస్ వాష్ తో కడుక్కోవాలి.
ఫేస్ ప్యాక్లు మేలు చేస్తాయి
అన్నిరకాల ఫేస్ ప్యాక్ లు అందరికీ సెట్ అవ్వవు. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు.. బియ్యప్పిండి, శెనగపిండి, నిమ్మరసం-–ఓట్స్, టొమాటో గుజ్జుతో ఫేస్ ప్యాక్ లు వేసుకోవాలి. పొడి చర్మం ఉన్నవాళ్లు ముల్తానీ మట్టి కలబంద... గధం–-కొబ్బరి నూనె, బొప్పాయి-–తేనెలతో ప్యాక్లు వేసుకోవాలి . నార్మల్ స్కిన్ ఉండేవాళ్లు వీటన్నింటినీ ప్రయత్నించొచ్చు. ఏ ప్యాక్ వేసుకున్నా ఇంట్లో చేసిందైతేనే ఆరోగ్యకరం.
పరిశుభ్రత పాటించాలి
ఎండాకాలంలో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. బయట తిరగొచ్చిన తరువాత చల్లటి నీళ్లలో కొన్ని వేపాకులు వేసుకుని స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాక మళ్లీ మంచినీటితో స్నానం చేయాలి.
పూల్స్ లో ఉండే నీళ్లలో ఉండే క్లోరిన్ ఒంటికి మంచిది కాదు. వీలైనప్పుడు కాళ్లు -చేతులను కొద్దిగా ఉప్పు కలిపిన నీళ్లలో పెడితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంటుంది. తర్వాత కాళ్లు, చేతులకు మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం పొడిబారదు. ఈ వేసవిలో వదులుగా ఉండే దుస్తులే వేసుకోవాలి.
తినే ఆహారమూ ముఖ్యమే..
రోజుకు కనీసం 8 నుంచి -10 గ్లాసుల నీళ్లు తాగాలి అంతేకాదు పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చాలి బయట దొరికే శీతల పానీయాలు, జంక ఫుడ్ కు దూరంగా ఉండాలి. మధ్యమధ్యలో ముజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. ఇవన్నీ చర్మ సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి.
కళ్లు.. పెదాలను మర్చిపోవద్దు..
మధ్యాహ్నం పన్నెండు గంటం నుండి సాయంత్రం నాలుగు గంటల దాకా... సూర్యకాంతి ప్రభావం ఎక్కువ. ఈ టైమ్ లో ఎలాంటి చర్మ రక్షణ లేకుండా ఎండకు తిరిగితే చర్మ ఆరోగ్యం పాడవుతుంది. అయితే బయటికి వెళ్ళినప్పుడు కళ్లకు రక్షణగా సన్ గ్లాస్ పెట్టుకోవడం, పెదాలకు బామ్ రాసుకోవడం మరిచిపోవద్దు. ఎందుకంటే ఇవి ఎండకు త్వరగా దెబ్బతింటాయి. అలాగే ఎటైనా వెళ్తున్నప్పుడు చిన్న అలుగడ్డ రసం, కొన్ని కాటన్ ప్యాడ్లు తీసుకెళ్లాలి. కళ్లు మంటగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు.. -కళ్లు మూసుకుని రెప్పలపై కాటన్ ప్యాడ్ కాసేపు పెట్టుకోవాలి. కళ్ల మంట మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ సంప్రదించాలి