
- సిద్దిపేట సీపీకి జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఆదేశం
జగదేవపూర్, వెలుగు: మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ దళితులను అవమానించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ కమిషనర్ శ్వేతను జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఫోన్లో ఆదేశించారు. తిమ్మాపూర్ దళితులు డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్వర్యంలో మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ను హైదరాబాద్లో కలిశారు. గ్రామస్తులందరికీ కటింగ్ చేసే సెలూన్ షాపులో కటింగ్, షేవింగ్ చేయకుండా దళితవాడలో చెట్ల కింద చేస్తూ కుల వివక్ష, అంటరానితనం పాటిస్తున్నారని డైరెక్టర్కు వివరించారు. వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించే విధంగా కలెక్టర్, పొలీస్ కమిషనర్ను ఆదేశించాలని ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా హనుమన్ గుడిలోకి దళితులను రానివ్వకపొవడం, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చెరువుల పండుగలో దళితులు కూరగాయలు కట్ చేయనివ్వకుండా అవమానించారని వివరించారు. ఈ సందర్భంగా త్వరలోనే తిమ్మాపూర్లో జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ పర్యటిస్తారని డైరెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ దళిత నాయకులు నర్సింలు, కనకరాజు, అశోక్, శ్రీకాంత్, మహేందర్, కర్ణాకర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.