
న్యూఢిల్లీ: నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి 9 నెలల తర్వాత భూమి మీద క్షేమంగా తిరిగి రావడంతో ఆమె కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఆమె భూమి మీదకు సురక్షితంగా తిరిగి రావాలన్న తమ కల ఇన్నాళ్లకు నెరవేరిందని సునీతా విలియమ్స్ మరదలు ఫాల్గుణి పాండ్యా జాతీయ మీడియాతో తమ సంతోషాన్ని పంచుకున్నారు.
అంతేకాదు.. సునీతా విలియమ్స్ త్వరలో ఇండియాకు వస్తుందని కూడా ఆమె కన్ఫర్మ్ చేశారు. ఏ తేదీన వస్తుందని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని.. కానీ తొందర్లోనే ఆమె ఇండియాకు వస్తుందని చెప్పారు. ఈ సంవత్సరమే ఇండియాకు వస్తుందని ఆశిస్తున్నామని ఫాల్గుణి పాండ్యా తెలిపారు. భారత ప్రధాని మోదీ కూడా సునీతా విలియమ్స్ ఆరోగ్యం కుదుటపడ్డాక భారత్కు రావాలని ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో ఐఎస్ఎస్కు సునీత విలియమ్స్, విల్ మోర్ 8 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే, స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రొనాట్లు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. దీంతో, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సుమారు 9 నెలలు అక్కడే చిక్కుకుపోయారు. 286 రోజులు స్పేస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా.. ఐఎస్ఎస్లో ఎక్కువకాలం గడిపిన రికార్డు ఫ్రాంట్ రూబియో పేరిట ఉంది. ఆయన 371 రోజులు ఐఎస్ఎస్లో ఉన్నారు. ఇదే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డు. ఐఎస్ఎస్లో ఎక్కువ కాలం గడిపిన ప్రముఖ ఆస్ట్రొనాట్ల జాబితాలో సునీతా విలియమ్స్ చేరారు.
ALSO READ : జాగ్రత్తగా లేకపోతే ఎముకలు విరిగిపోతాయి.. మళ్లీ నడక నేర్చుకోనున్న సునీతా విలియమ్స్
అన్ డాకింగ్ సక్సెస్ అయ్యాక డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి వైపు జర్నీ ప్రారంభించింది. సోలార్ ప్యానెళ్ల ద్వారా స్పేస్క్రాఫ్ట్ బ్యాటరీలు చార్జ్అయ్యాయి. భూమిపై ల్యాండింగ్కు 44 నిమిషాల ముందు థ్రస్టర్ ఆన్ చేశారు. దీంతో డ్రాగన్ క్యాప్సూల్ వేగం తగ్గింది. ల్యాండింగ్కు 3 నిమిషాల ముందు 3 ప్యారాచూట్లు తెరుచుకున్నాయి. దీంతో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వేగం మరింత తగ్గింది. డ్రాగన్ క్యాప్సూల్ అట్లాంటిక్ మహా సముద్రంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత రికవరీ టీమ్, దాన్ని తీరానికి తీసుకొచ్చింది.