
తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆంధ్రాలో సందడి చేశారు. కడప జిల్లాలో ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు సబంధించిన షూటింగ్ కోసం .. సూపర్ స్టార్ రజినీ వచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో తలైవా లేటెస్ట్ మూవీ షూటింగ్ జరిగింది. రజనీకాంత్ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఈ క్వారీలో చిత్రీకరించారు.
ఈ షూటింగ్ కోసం చెన్నై నుంచి జనవరి 30న కడప చేరకున్నారు రజినీకాంత్. షూటింగ్ నిమిత్తం జమ్మల మడుకు వచ్చిన తలైవాను చూడటానికి భారీ ఎత్తున జనం ఎగబడ్డారు. సూపర్ స్టార్ వచ్చాడని చుట్టు ప్రక్కల ప్రాంతాలకు పాకడంతో.. కాస్త దూర ప్రాంతాల నుంచి కూడా ఆయన అభిమానులు షూటింగ్ స్పాట్ కు వచ్చారు. తన అభిమానులకు తమిళ సూపర్ స్టార్ అభివాదం చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 170వ సినిమా వెట్టయన్ కు సంబంధించి యాక్షన్స్ సీన్స్ ను కడప జిల్లా ఎర్రగుంట్లలో షూటింగ్ తీశారు. జమ్మలమడుగు ప్రాంతం నాపరాయి గనులకు ప్రసిద్ది. ఇక్కడ ఎర్రగుంట్ల ప్రాంతంలోని నాపరాయి గనిలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు.
ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేలు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రజనీకాంత్ 170 సినిమాను చేస్తున్నారు. నిడిజీవి ప్రాంతంలోని ఎర్రగుంట్ల పురపాలక సంఘానికి చెందిన కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డికి చెందిన క్వారీలో ఈ షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్లు చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వీరంతా ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కి సంబంధించిన విడిది గృహంలో బస చేసినట్లు చెబుతున్నారు.