![పని చేయాలంటే ఇష్టపడట్లే.. ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం](https://static.v6velugu.com/uploads/2025/02/supreme-court-expresses-anger-over-freebies_6IKk2utZBq.jpg)
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని అసహనం వ్యక్తం చేసింది. తద్వారా వారు నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వ్యక్తులకు ఆశ్రయం కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన దిసభ్య ధర్మాసనం బుధవారం (ఫిబ్రవరి 12) ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా ఎన్నికలకు ముందకు వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపై ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది. "దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్న ఈ ఉచితాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. ఎటువంటి పని చేయకుండానే వారికి రేషన్, డబ్బు అందుతున్నాయి. ఫ్రీగా రేషన్, డబ్బు రావడంతో వారు పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. వారిపై మీకున్న శ్రద్ధను మేము అభినందిస్తున్నాము. కానీ వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేసి దేశాభివృద్ధికి దోహదపడేలా చేయడం మంచిది కదా’’ అని ధర్మాసనం పేర్కొంది.
Also Read :- తెలంగాణకు 2 బుల్లెట్ రైళ్లు
పట్టణాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని.. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తరుఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే.. పట్టణ పేదరిక నిర్మూలనకు ఇంకా ఎంత సమయం పడుతుందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.