
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మథురలోని కృష్ణ జన్మభూమి ఏరియాలో కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతను 10 రోజులు ఆపాలని రైల్వే అధికారులను ఆదేశించింది. కృష్ణ జన్మభూమి సమీపంలో కూల్చివేతలపై యాకూబ్ షా(66) అనే వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు.
ఆ పిటిషన్ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన బెంచ్ బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. 1800 నుంచి కృష్ణ జన్మభూమి ఏరియాలో వందల కుటుంబాలు నివసిస్తున్నాయని చెప్పారు. ఆ భూములు రైల్వే ఆస్తి అని పేర్కొంటూ ఈ నెల 9 నుంచి రైల్వేశాఖ కూల్చివేతలకు దిగిందని వివరించారు. కూల్చివేత నోటీసుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ దావా పెండింగ్లో ఉందన్నారు. వాదనలు విన్న బెంచ్ ప్రస్తుతానికి కూల్చివేతలను ఆపాలని ఆదేశించింది.