
న్యూఢిల్లీ: ఎవరినైనా పాకిస్తానీ, మియాన్–టియాన్ వంటి పేర్లతో పిలవడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే నేరం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జార్ఖండ్రాష్ట్రం చాస్ సబ్ డివిజనల్ ఆఫీసులో ఉర్దూ ట్రాన్స్లేటర్, రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) యాక్టింగ్ క్లర్క్ దాఖలు చేసిన క్రిమినల్ కేసులో జస్టిస్ బీవీ నాగరత్న, సతీశ్ చంద్ర శర్మలతో కూడిన డివిజన్బెంచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీఐ కార్యకర్తను నిర్దోషిగా ప్రకటించింది.
ఈ అప్పీల్పై ఫిబ్రవరి 11న కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ‘‘ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చిన తనను ‘పాకిస్తానీ’.. ‘మియాన్–టియాన్’ అని పిలవడం ద్వారా మతపరమైన భావాలను దెబ్బతీశాడని ఉర్దూ ట్రాన్స్లేటర్ ఆరోపించారు. అయితే అది చాలా పేలవమైన స్టేట్మెంట్ అనడంలో సందేహం లేదు. అది మతపరమైన మనోభావాలను దెబ్బతీసేంత పెద్ద నేరం కాదు. అందువల్ల, ఐపీసీ సెక్షన్ 298 కింద చేసిన అప్పీల్ను డిశ్చార్జ్ చేస్తున్నం” అని పేర్కొంది.