ఎన్నికల సమయంలో ఉచిత హామీలపై ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో ఉచిత వాగ్దానాలను లంచంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఎన్నికల్లో పొలిటికల్ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని పిటిషనర్ కోరారు. అటువంటి వాగ్దానాలను అరికట్టడానికి పోల్ ప్యానెల్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కేంద్రానికి, భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల్లో ఉచిత హామీలు రాజ్యాంగానికి విరుద్ధం..రాజకీయ నాయకులు ఓట్ల కోసం జనాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఆ హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పడం లేదు. వాటికి ఆదాయం ఎలా సమకూరుస్తారో చెప్పకుండా తరచూ ఇలాంటి ఉచిత వాగ్దానాలు ఇస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారు. ఖజనాపై ఆర్థిక భారం పడుతుంది. ఇలాంటి ఉచిత పథకాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు.