గ్రూప్-1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ

గ్రూప్-1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ

ఢిల్లీ: గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు చుక్కెదురైంది. పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. 

గ్రూప్-1 పరీక్ష నిలిపివేయాలని స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్కు కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషన్లరకు సుప్రీం కోర్టు సూచించింది. గ్రూప్-1 ఫలితాల వెల్లడికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది.

సుప్రీం కోర్టు తీర్పుతో గ్రూప్-1 పరీక్షకు లైన్ క్లియర్ అయింది. ఇవాళ (అక్టోబర్ 21, 2024) మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్-1 పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ నెల 27 వరకు (అక్టోబర్ 27, 2024) కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు 31,383 మంది హాజరు కానుండగా, వారి కోసం 46  పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 సెంటర్లున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్స్​ జరగనున్నాయి.

తొలి రోజు సోమవారం క్వాలిఫైయింగ్ టెస్ట్​ ఇంగ్లిష్​ ఉంటుంది. ఆ తర్వాత  వరుసగా ఆరు వేర్వేరు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. ఆరు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ర్యాంకింగ్ ఫైనల్ అవుతుంది. ప్రతి పేపర్‌‌కు 150 మార్కులు ఉంటాయి. అయితే, ఇంగ్లిష్​ పేపర్​ మినహా మిగిలిన అన్ని పేపర్లను తెలుగు, ఇంగ్లిష్​, ఉర్దూ మీడియంలో రాసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది. 

అభ్యర్థులు ఎంచుకున్న మీడియంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. కొన్ని పేపర్లు ఒక మీడియంలో రాసి, మరికొన్ని వేరే మీడియంలో రాస్తే ఆ అభ్యర్థిని ఫలితాల్లో పరిగణనలోకి తీసుకోబోమని టీజీపీఎస్సీ ఇప్పటికే వెల్లడించింది. ఒకే జవాబు పత్రంలో సగం ఒక మీడియంలో, మరికొంత మరో మీడియంలో రాసినా అది చెల్లుబాటు కాదని స్పష్టత ఇచ్చింది.