శ్రీశైలం, సాగర్​ను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించలేం:సుప్రీంకోర్టు

శ్రీశైలం, సాగర్​ను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించలేం:సుప్రీంకోర్టు
  • ఏ అధికారంతో అడుగుతున్నారని ఏపీని నిలదీసిన సుప్రీంకోర్టు
  • ఈ విషయంలో ఎలాంటి రిలీఫ్​ ఇవ్వలేమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలంను కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డుకు అప్పగించాలన్న ఏపీ వితండ వాదా న్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఏ అధికారంతో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని వాదిస్తున్నారని ప్రశ్నించింది. ఏపీ వాదనతో ఏకీభవించడం లేదని పేర్కొంది. 

విభజనచట్టంలోని వివిధ సెక్షన్లపై ఆరా తీసిన కోర్టు.. ఈ విషయంలో ఏపీకి ఎలాంటి రిలీఫ్​ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్​పై మంగళ వారం జస్టిస్​అభయ్ ఎస్ ఓకా, జస్టిస్​ఉజ్జల్​భూయాల్​తో కూడిన బెంచ్ విచారించింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో పాటు శ్రీశైలం నుంచి విద్యు దుత్పత్తి కోసం తెలంగాణ ఇచ్చిన జీవో 34ను రద్దు చేసేలా ఆర్డర్స్​ ఇవ్వాలని ఏపీ కోరింది. 

దానిపైనా విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎలాంటి ఆంక్షల్లేకుండా విద్యుదుత్పత్తి కోసం నీటిని తరలించడం సరికాదని పేర్కొంది. తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవో 34పై స్టేట్​మెంట్​ఇవ్వాలని తెలంగాణ అడ్వకేట్​ను ఆదేశించింది. విచారణ మార్చి 18కి వాయిదా వేసింది. 

ఏపీ వితండ వాదం..

శ్రీశైలం, నాగార్జునసాగర్​, పులిచింతల ప్రాజెక్టులను పూర్తిగా కేఆర్ఎంబీకి అప్పగించాలని, వాటి నుంచి నీటిని విడుదల చేసే అన్ని ఔట్​లెట్లను బోర్డుకే ఇచ్చేయాలని సుప్రీంకోర్టులో ఏపీ వితండ వాదం చేసింది. కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ 1(బచావత్​ ట్రిబ్యునల్​/కేడబ్ల్యూడీటీ 1) అవార్డు ఇప్పటికీ అమలులో ఉందని ఏపీ తరఫు అడ్వకేట్​ జైదీప్​ గుప్తా వాదించారు. 

ఈ సందర్భంలో జోక్యంచేసుకున్న తెలంగాణ తరఫు అడ్వకేట్​సీఎస్​వైద్యనాథన్.. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలకు సంబంధించి కేడబ్ల్యూడీటీ 2లో వాదనలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఆ కేసు పెండింగ్​లో ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.