
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన పలు పిటిషన్లు ఈ నెల 25న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టు విచారణ జాబితాలో రిజిస్టార్ మెన్షన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టీ. ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఎమ్మెల్యే లు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ సుప్రీంకోర్టు లో పిటిషన్లు దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్లు గత వారం విచారణ జాబితాలో మెన్షన్ అయినప్పటికీ... పలు కారణాల వల్ల ఆ రోజు విచారణ జరగలేదు. దీంతో శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి బెంచ్ ఎదుట పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత వారం కూడా అనివార్య కారణాలతో లిస్ట్ అయినా విచారణకు రాలేదని గుర్తు చేశారు. ఈ విజ్ఞప్తి ని పరిగణలోకి తీసుకొన్న బెంచ్.. ఈ నెల 25న వాదనలు వింటామని పేర్కొంది.