
డిఫరెంట్ కాన్సెప్ట్లను సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సూర్య. ప్రస్తుతం ‘కంగువ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ను అండమాన్ దీవుల్లో స్టార్ట్ చేసినట్టు సూర్య సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘లైట్స్, కెమెరా, యాక్షన్..’ అంటూ ‘లవ్, లాఫ్టర్, వార్’ ఈ మూడింటి నేపథ్యంలో కార్తీక్ చిత్రీకరణ మొదలుపెట్టాడని పోస్ట్ చేశాడు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో సూర్య డిఫరెంట్ లుక్లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇది సూర్య నటిస్తున్న 44వ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు జోజు జార్జ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సూర్యకు చెందిన 2డి ఎంటర్టైన్మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.