కమీషన్లు తీసుకుని సాకులు చెబుతున్రు:ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి​ ​

కమీషన్లు తీసుకుని సాకులు చెబుతున్రు:ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి​ ​

 వరంగల్, వెలుగు: కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి కరోనా అడ్డువచ్చిందని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్ కు, మద్రాస్, తిరుపతిలో తాను కడుతున్న షాపింగ్ కాంప్లెక్స్​లు, బిల్డింగులకు అడ్డురాలేదా చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి మండిపడ్డారు. రాజభోగాలు అనుభవించే నిర్మాణాలు, సెక్రటేరియట్ తప్పించి 10 ఏండ్లలో పూర్తి చేయని కాళోజీ కళాక్షేత్రానికే సాకులు దొరికాయా అంటూ ప్రశ్నించారు.

ఆదివారం ఆయన హనుమకొండ కాంగ్రెస్ భవన్​లో ప్రెస్​మీట్ నిర్వహించి మాట్లాడారు. వినయ్​భాస్కర్ శిలాఫలకాలు వేసి పనులు పూర్తయినట్లు కలలు కనడం తప్ప, నిధులు తేలేని అసమర్థుడని విమర్శించారు. కళాక్షేత్రం పేరుతో కమీషన్లు తీసుకుని తుప్పుపట్టిన సలకల బిల్డింగ్ వదిలేస్తే, తాము మళ్లీ పనులు మొదలుపెట్టామన్నారు. కాళోజీ కళాక్షేత్రం ఒక్కటే కాదని, మాడవీధులు, నయీంనగర్​ నాలా, ఫాతిమా బ్రిడ్జి వంటి ప్రాజెక్టులకు ప్రపోజల్స్ పేరుతో శిలాఫలకాలు వేసి వాటిని కట్టినట్లు పగటి కలలు కనడం తప్ప నిధులు మంజూరు చేయడంలో ఫెయిల్​ అయ్యాడన్నారు.

ఈ విషయంలోనూ చర్చకు రావడానికి సిద్ధమా అంటూ సవాల్​ విసిరారు. రాష్ట్రానికి సోమవారం సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ రానుందని, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైన నిధుల విషయమై సీఎం చర్చించాల్సి ఉన్నందున, కాళోజీ కళాక్షేత్రం ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. నేతలు, కార్పొరేటర్లు అజీజ్​ఖాన్, తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, బత్తిని శ్రీనివాస్, వీరగంటి రవీందర్​ తదితరులు పాల్గొన్నారు.