
- దాసారం బస్తీ వాసులకు అండగా ఉంటామని హామీ
పద్మారావునగర్, వెలుగు: ‘పేదల గుడిసెల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోం.. అక్రమ చొరబాట్లను సహించేది లేదు.. ఖబర్దార్అంటూ సనత్నగర్ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్రమార్కులకు వార్నింగ్ ఇచ్చారు. సనత్నగర్నియోజకవర్గం దాసారం బస్తీలో 30 ఏండ్లుగా దాదాపు 300 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నాయి. కాగా బుధవారం కొందరు తమ అనుచరులతో వచ్చి ఆ ప్రాంతానికి ఖాళీ చేయాలని, గుడిసెలు తొలగించాలని హెచ్చరించారు.
ఆందోళన చెందిన బస్తీ వాసులు గురువారం ఉదయం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు తరలివచ్చారు. ఎన్నో ఏండ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, ఉన్నపళంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని ఎమ్మెల్యే ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని వివరించారు. బాధితుల వెంట సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఉన్నారు.