పళని ఆలయ పంచామృతంపై వివాదస్పద వ్యాఖ్యలు : తమిళ దర్శకుడు అరెస్ట్

పళని ఆలయ పంచామృతంపై వివాదస్పద వ్యాఖ్యలు : తమిళ దర్శకుడు అరెస్ట్

తిరుమల లడ్డూ కల్తీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ ప్రసిద్ధి చెందిన పళని ఆలయ ‘ప్రసాదం’పై (Palani Temple Prasadam) తమిళ డైరెక్టర్ మోహన్ జి (Mohan G) కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదవడంతో.. మంగళవారం (సెప్టెంబర్ 24న) ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అసలు ఆయన ఏం మాట్లాడాడో..ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడో అనే వివరాల్లోకి వెళితే..   

తిరుపతి లడ్డూలను తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు దొరుకుతుందనే అంశంపై..తమిళ డైరెక్టర్ మోహన్ జి ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచామృతంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ | జానీకి బెయిలా.. కస్డడీనా..? రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ‘పళని పంచామృతంలో మగవారి నపుంసకత్వానికి దారితీసే మందు పంచమితం కలిసిఉందని విన్నాను. అప్పుడు పంచామృతాన్ని పారబోసి.. ఆ వార్తను దాచిపెట్టారు. తర్వాత ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదని నాకు సరైన వివరణ ఇవ్వలేదు.. అక్కడ పనిచేస్తున్న వారు మాత్రం అవి గర్భనిరోధక మాత్రలని  నాకు చెప్పారని’ అని మోహన్ జి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 

ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదవడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ను తిరుచ్చికి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయన అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ క్రమంలో "పళని ఆలయ పంచామృతం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని" తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు హెచ్చరించారు.

మరోవైపు, మోహన్ జి అరెస్టును బిజెపి నాయకుడు అశ్వథామన్ ఖండించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని..అరెస్టుకు గల కారణాల గురించి దర్శకుడి కుటుంబానికి కూడా తెలియజేయలేదని ఆయన తెలిపారు.

ఈ క్రమంలో " అరెస్ట్ అయ్యి 5 గంటలకు పైగా కావస్తున్నా ..తమిళనాడు పోలీసులు మాత్రం కారణం ఏమిటి? మరియు కేసు ఏమిటి? అనేదానిపై మోహన్ జి కుటుంబానికి కూడా అధికారిక సమాచారం ఇవ్వలేదని..ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం..తమిళనాడు పోలీసులు తమిళనాడు ప్రభుత్వానికి చిక్కిన శాఖగా మారింది" అని అశ్వథామన్ అల్లిముత్తు ట్వీట్ చేశారు.

మోహన్ జి సినిమాల విషయానికి వస్తే.. 2016లో పజయ వన్నారపెట్టై చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్‌ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2020లో ద్రౌపతి చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ద్రౌపతి, రుద్రతాండవం, బగాసురన్‌ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్‌ జి.