ఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
బిల్లులకు ఆమోదం తెలపకుండా తమిళనాడు గవర్నర్ మూడేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మరోవైపు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
బిల్లుల ఆమోదంలో జాప్యానికి కారణాలను వివరించాలని నోటీసుల్లో పేర్కొంది. కేరళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ కేకే వేణుగోపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. 21 నెలలుగా ఎనిమిది బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని ధర్మాసనానికి తెలిపారు.