Producer Dilli Babu: సినీ ఇండస్ట్రీలో విషాదం..సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ మృతి

Producer Dilli Babu: సినీ ఇండస్ట్రీలో విషాదం..సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ మృతి

తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత డిల్లీ బాబు (50) కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం (సెప్టెంబర్ 9న) చెన్నైలో మృతి చెందారు. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డిల్లీ బాబు మరణంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని అంత్యక్రియలు ఇవాళ జరగనున్నట్లు సమాచారం. 

డిల్లీ బాబు తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో సూర్యతో రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ బ్యానర్ పై ఈ యన తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా మిరల్, మరకతమణి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. 

ముఖ్యంగా తమిళంలో ఆయన నిర్మించిన హార్రర్ చిత్రాలు ఆడియన్స్ కు థ్రిల్ ఇచ్చాయి. హీరో సూర్యతో తెరకెక్కించిన ‘రాక్షసుడు’, ఆది పినిశెట్టితో తీసిన ‘మరకతమణి’, మిరల్, కాల్వన్, కుట్రమ్ కుట్రమే చిత్రాలు కూడా హార్రర్ నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో హార్రర్ చిత్రాల నిర్మాతగా డిల్లీబాబు పేరు గడించారు. 

డిల్లీబాబు మృతి పట్ల డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. " డిల్లిబాబుని కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాను. ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ యువకులను ఆయన సపోర్ట్ చేశారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు పెద్ద నష్టం. కుటుంబ సభ్యులకు నా సానుభూతి!" అని తెలిపారు.