
- సీఎం రేవంత్కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం
- ఢిల్లీలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించిన డీఎంకే ప్రతినిధులు
న్యూఢిల్లీ, వెలుగు: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ సర్కార్ చేస్తున్న కుట్రను తిప్పికొడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది నియోజకవర్గాల పునర్విభజన కాదని, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను కుదించే ప్రయత్నమని విమర్శించారు.
పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు చెన్నైలో 22న జరిగే సమావేశానికి హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన లేఖను ఆ రాష్ట్ర మంత్రి కేఎన్.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీలో రేవంత్ రెడ్డికి అందజేసింది. ఈ భేటీలో డీఎంకే ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్ విజయన్, డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి, డీఎంకే ఎంపీలు ఏ రాజా, ఎన్ఆర్ ఇళంగో, కళానిధి వీరస్వామి, అరుణ్ నెహ్రూ పాల్గొన్నారు.
అయితే 2026 తర్వాత చేపట్టే జనగణన వరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదని నిబంధనలున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అంతకు ముందుగానే ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చిందని తమిళనాడు సీఎం స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై తమ రాష్ట్రంలో ఇప్పటికే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని లేఖలో వెల్లడించారు.
ఈ విషయంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలతో కూడిన ఐక్య కార్యాచరణ కమిటీలో (జేఏసీ) చేరేందుకు అంగీకారం తెలపాలని సీఎంను కోరారు. భవిష్యత్ కార్యాచరణ చేపట్టేందుకు జేఏసీలోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రతినిధిని నియమించాలని లేఖలో సూచించారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గిస్తే సహించేది లేదు
దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాన్ని సహించబోమని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ‘మేం (దక్షిణాది రాష్ట్రాలు) దేశానికి ఎంతో సేవ చేశాం. దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీకి పెద్దగా ప్రాతినిధ్యం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఓడిపోవడంతో ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ భావిస్తున్నది.
మాపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటాం’ అని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రలను ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా ఇప్పటికే నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకొని చెన్నై సమావేశానికి హాజరవుతానని తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజనపై చర్చలు జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని పార్టీల నేతలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానా రెడ్డికి సూచించినట్లు వెల్లడించారు.
తాము నిర్వహించే సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని, ఆయన సమావేశంలో పాల్గొని అక్కడ వెల్లడైనఅభిప్రాయాలను కేంద్ర కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. 22న చెన్నైలో నిర్వహించే సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజనతో కలిగే నష్టాలు.. వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.
సల్మాన్ ఖుర్షీద్తో సీఎం భేటీ
తెలంగాణ రైజింగ్ ఇంటర్నేషనల్ సమిట్ పై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిని కలిసే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తుగ్లక్ రోడ్ లోని సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితులు గురుదీప్ సింగ్ సప్పల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎంపీలు మల్లు, చామల, అనిల్ కుమార్ యాదవ్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి నాయుడు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఇందులో పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు రైజింగ్ తెలంగాణ సమిట్పై చర్చించారు.