
- పెద్దగా దిగుమతి చేసుకోని వాటిపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాలని చూస్తున్న కేంద్రం
- ఈవీలు, వెహికల్ విడిభాగాలపై టారిఫ్ తగ్గించినా, ఇండియన్ కంపెనీలు నష్టపోవని అంచనా
- ఈ ఏడాది చివరిలోపు ఇరు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్
న్యూఢిల్లీ : ఇండియాపై పరస్పర టారిఫ్లు కచ్చితంగా వేస్తామని ట్రంప్ ప్రకటించడంతో మరికొన్ని యూఎస్ ప్రొడక్ట్లపై సుంకాలు తగ్గించాలని కేంద్రం చూస్తోంది. కానీ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించినా, లోకల్ తయారీ కంపెనీలకు ఎటువంటి నష్టం కలగని ప్రొడక్ట్లపైనే సుంకాలు తగ్గించాలని ప్లాన్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య కుదరబోయే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ (బీటీఏ) లో భాగంగా యూఎస్ నుంచి దిగుమతులను ఇండియా పెంచనుంది.
ఇందులోనూ తక్కువ వాల్యూమ్లో జరిగే దిగుమతులపైనే ఎక్కువగా సుంకాలను తగ్గించాలని చూస్తోంది. ఇప్పటికే ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్ వంటి సెక్టార్లలోని కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అమెరికా దిగుమతుల వలన ఈ సెక్టార్లకు పెద్దగా నష్టం ఉండదని అంచనా. వ్యవసాయ రంగం నష్టపోకుండా చూసుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టనుంది. సుంకాలు తగ్గించినా, లోకల్ కంపెనీలకు ఎటువంటి నష్టం ఉండదనుకునే ప్రొడక్ట్లను గుర్తించే పనిలో వివిధ మినిస్ట్రీలు ఉన్నాయి. యూఎస్ ప్రభుత్వం వేయనున్న పరస్పర టారిఫ్ల ప్రభావం ఎలా ఉంటుందో లెక్కలేస్తున్నాయి.
ఇప్పటికే కొన్నింటిపై..
ప్రస్తుతం ఇండియా నుంచి ఏడాదికి రూ.1.2 లక్షల కోట్ల విలువైన వెహికల్ పార్టులు యూఎస్కు ఎగుమతి అవుతున్నాయి. వీటిపై అమెరికా ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీని వేయడం లేదు. అదే ఇండియా చేసుకుంటున్న ఆటో పార్టుల దిగుమతులపై 5 శాతం నుంచి 15 శాతం వరకు డ్యూటీ పడుతోది. బీటీఏ చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ అంశంపై చర్చించారు.
ఇరు దేశాలు కూడా వ్యాపారాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల (రూ.43 లక్షల కోట్ల)కు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్లో మొదటి దశ ఈ ఏడాది చివరినాటికి పూర్తవ్వొచ్చని అంచనా. యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని ప్రొడక్ట్లపై ప్రభుత్వం ఇప్పటికే సుంకాలను తగ్గించింది. ఈ నెల 1 న ప్రవేశపెట్టిన బడ్జెట్లో బార్బన్ విస్కీపై వేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీని 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించింది.
చేపల ఆహారం, స్క్రాప్ మెటీరియల్స్, ఇథర్నెట్ స్విచ్లు, మోటార్సైకిల్పై కూడా సుంకాలకు కోత పెట్టింది. ఈ సుంకాల కోతతో అమెరికన్ కంపెనీలు ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది. మరోవైపు ఇండియా–యూఎస్ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం పెద్దగా జరగడం లేదు. ఈ సెగ్మెంట్లో సుంకాలు తగ్గించినా, ఇండియన్ కంపెనీలకు పెద్దగా నష్టం ఉండదని ఎనలిస్టులు భావిస్తున్నారు. ‘యూఎస్లో ఖర్చులు చాలా ఎక్కువ. అమెరికన్ ఈవీ తయారీ కంపెనీలు ఇండియాలో కార్యకలాపాలు కొనసాగించడం లేదు. వీటిపై సుంకాలు తగ్గించినా, భారీగా దిగుమతులు పెరగవు’ అని వివరించారు.