తార్నాక ప్రాంతవాసులకు గుడ్ న్యూస్.. 8 ఏండ్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్

తార్నాక ప్రాంతవాసులకు గుడ్ న్యూస్.. 8 ఏండ్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా మూసి ఉన్న తార్నాక జంక్షన్ మళ్లీ వాహనదారులకు అందుబాటులోకి రానుంది. తార్నాక జంక్షన్‎ను రీ ఓపెన్ చేసేందుకు ట్రాఫిక్ సిటీ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట్ వైపు వాహనాలు నేరుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేశారు. రేపటి (ఏప్రిల్ 18) నుంచి మే 2  వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు పోలీసులు.

 మొత్తం 15 రోజుల ట్రయల్ రన్ అనంతరం.. శాశ్వతంగా ఆ జంక్షన్‎ను వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తార్నాక జంక్షన్ క్లోజ్ చేసి ఉండటం వల్ల ఉస్మానియా వర్శిటీ, లాలాపేట మధ్య నేరుగా రాకపోకలు సాగించే వీలు లేదు. వర్శిటీ నుంచి లాలాపేట వెళ్లాలంటే తార్నాక జంక్షన్ నుంచి మెట్టగూడ వైపు ముందుకు వెళ్లి యూ టర్న్ తీసుకోవాల్సి ఉంది. అలాగే.. లాలాపేట్ నుంచి వర్శిటీకి రావాలంటే తార్నాక జంక్షన్ నుంచి హబ్సిగూడ వైపు ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకోవాలి. 

దీంతో టైమ్ వృథా కావడంతో పాటు పెట్రోల్ వేస్ట్. ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ దాటి చుక్కలు చూపిస్తుండగా.. ఈ యూటర్న్‎లు వాహనదారులుగా ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో తార్నాక జంక్షన్‎ను తెరవాలని గతకొద్ది రోజులుగా వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. మళ్లీ జంక్షన్‎ను రీ ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో తార్నాక ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

బీఆర్ఎస్​ హయాంలో క్లోజ్​

బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ మేనేజ్​మెంట్​పేరుతో ఎనిమిదేండ్ల కింద తార్నాక  జంక్షన్‎ను మూసి వేశారు. జంక్షన్​ సమీపంలో మెట్రో పిల్లర్​అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్​జామ్‎ను నివారించాలని, వాహనాల ఫ్లో సులువుగా ఉంటుందని, ట్రాఫిక్​ పోలీసుల అవసరముండబోదంటూ అటు రైల్వే డిగ్రీ కాలేజీ సమీపంలో, ఇటు ఐఐసీటీ సమీపంలో యూ-టర్న్‎లను ఏర్పాటు చేశారు. అయితే, ట్రాఫిక్​సమస్య తీరకపోగా మరింత ఎక్కువైంది. 

►ALSO READ | కోచింగ్ సెంటర్లకు CCPA వార్నింగ్..తప్పుడు ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు

రోజూ ఉదయం, సాయంత్రం పీక్​అవర్స్‎లో రెండు వైపులా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభిస్తోంది. గతంలో ఒకరిద్దరు ట్రాఫిక్​కానిస్టేబుల్స్​ఉన్నచోట నలుగురు కానిస్టేబుల్స్‎ను డ్యూటీ చేయాల్సి వస్తోంది. పైగా యూ-టర్న్​ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ట్రాఫిక్​ సిగ్నల్​సిస్టమ్​పై పనిచేసే అర్కడేస్ కంపెనీతోపాటు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్​విభాగం, ట్రాఫిక్​పోలీసులతో ప్రత్యేక కమిటీ వేసింది. స్టడీ చేసి జంక్షన్‎ను తిరిగి ప్రారంభించాలని సిఫారసు చేసింది.