
- 400 క్వింటాళ్లకు పైగా సీడ్స్ సీజ్
- రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో నకిలీ విత్తనాలు పట్టివేత
- 33 మందిని అరెస్టు చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: సీడ్ మాఫియాపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్, అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీమ్లు వారం రోజులుగా పలు జిల్లాల్లోని విత్తన పరిశ్రమలు, ఫర్టిలైజర్ షాపులపై దాడులు నిర్వహించాయి. అనుమతిలేని సీడ్ప్లాంట్లకు తాళాలు వేయడంతో పాటు బ్లాక్చేసేందుకు స్టాక్ పెట్టుకున్న సీడ్స్ను, కల్తీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 118.29 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. గురువారం నిర్వహించిన దాడుల్లో మరో 279 క్వింటాళ్ల వరి సీడ్స్, 1,600కు పైగా పత్తి విత్తనాల ప్యాకెట్లను టాస్క్ఫోర్స్ఆఫీసర్లు సీజ్ చేశారు.
11 జిల్లాల్లో టాస్క్ఫోర్స్ దాడులు
టాస్క్ఫోర్స్ టీమ్లు వారం రోజులుగా 11 జిల్లాల్లో దాడులు చేశాయి. రూ.రెండు కోట్లకుపైగా విలువైన 118.29 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సీజ్ చేశారు.
వీటిలో ఎక్కువగా పత్తి విత్తనాలే ఉన్నాయి. ఇందు కు సంబంధించి 33 మందిని అరెస్టు చేశారు. గురువారం వరంగల్, మెదక్, జనగామ జిల్లాల్లో దాడులు కొనసాగాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 35 క్వింటాళ్ల నిషేధిత హెచ్టీ కాటన్ సీడ్స్ పట్టుబడ్డాయి.
నారాయణపేట జిల్లాలో 8.19 క్వింటాళ్లు, మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో 24 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో 36.48 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. కొడంగల్, దౌల్తాబాద్, బషీరాబాద్, యాలాల ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, జనగామ జిల్లాల్లో టాస్క్ఫోర్స్ దాడులు చేపట్టగా భారీగా నకిలీ విత్తనాలు దొరికాయి.
మెదక్ జిల్లా మాసాయిపేటలో అనధికారికంగా ఏర్పాటు చేసిన నకిలీ విత్తన పరిశ్రమను గురువారం అగ్రికల్చర్ ఆఫీసర్ ఝాన్సీ సీజ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లైసెన్సులు తీసుకోకుండా ఇండస్ట్రీ పెట్టి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 279 క్వింటాళ్ల ధాన్యం బస్తాలను సీజ్ చేసిన ఆఫీసర్లు.. పరిశ్రమకు తాళం వేసి నిర్వాహకులపై కేసు పెట్టారు.
వరంగల్ సిటీలో కృత్రిమ కొరత సృష్టిస్తున్న సీడ్స్, ఫర్టిలైజర్స్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈనెల 28న వరంగల్లోని రఘురామ, మేరీమాత, ఉషోదయ, మహాలక్ష్మి సీడ్స్ ఫర్టిలైజర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయా షాపుల ఓనర్లు యూఎస్ 7067, సదానంద్, సాంకేత్, నవనీత్, ఆధ్య తదితర కంపెనీల విత్తనాలను బ్లాక్ చేసి, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేయగా, ఒకే రోజు దాదాపు రూ.4.06 లక్షల విలువైన 471 పత్తి విత్తన ప్యాకెట్లను సీజ్ చేశారు.
29న హనుమకొండ జిల్లా నడికుడ మండలం వెంకటేశ్వర్లపల్లిలో మా వెంకటేశ్వర్లపల్లి రైతు డిపో యజమాని ఇంట్లో బ్లాక్ చేసి నిల్వ ఉంచిన రూ.2.85 లక్షల విలువైన 330 పత్తి విత్తన బ్యాగులను టాస్క్ఫోర్స్ఆఫీసర్లు పట్టుకున్నారు. షాప్ ఓనరుపై కేసు నమోదు చేశారు. జిల్లాలో గురువారం కూడా తనిఖీలు కొనసాగాయి.
జనగామలోని ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ సీతారామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్తీ విత్తనాలు అమ్మినా, విత్తనాలను, ఎరువులను బ్లాక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
24న టాస్క్ఫోర్స్ అధికారులు ఆదిలాబాద్లోని రాంనగర్ కాలనీలో ఓ గోదాంలో తనిఖీలు చేయగా భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. నాసిరకం విత్తనాలకు కలర్ వేసి మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నట్లు అధికారుల దాడుల్లో తెలిసింది. ఈ దాడుల్లో రూ.19.5 లక్షల విలువైన నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్ కు తరలించారు. ముగ్గురిని అరెస్టు చేశారు.