అయోధ్యలో మ్యూజియం ఆఫ్​ టెంపుల్స్​

అయోధ్యలో మ్యూజియం ఆఫ్​ టెంపుల్స్​

అయోధ్యలో రూ.650కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్​ నిర్మాణానికి టాటా సన్స్​ చేసిన ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మ్యూజియం ఆఫ్ టెంపుల్స్​ కోసం రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏండ్లపాటు లీజుకు తీసుకున్నారు. కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ(సీఎస్​ఆర్​)లో భాగంగా టాటా సన్స్​ ప్రతినిధులు గతంలోనే తమ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది.

ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఇక్కడ తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. దీంతోపాటు టెంపుల్​ సిటీ అయోధ్యలో మరో రూ.100 కోట్లతో టాటా సన్స్​ చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పురాతన చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రాంతాలుగా మెరుగులు దిద్దడంతోపాటు లక్నో, ప్రయోగ్​రాజ్​, కపిలవాస్తు ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో హెలికాప్టర్​ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని క్యాబినెట్​ నిర్ణయించింది.