
ఏపీ పాలిటిక్స్లో కీలకనేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో 14 రోజుల్లో అంటే 2023 అక్టోబర్ 22 రాత్రి 7 గంటల 59 నిమిషాలకు పెద్దలు శుభ ముహూర్తాన్ని ఖరారు చేశారు. విజయవాడ పోరంకి రోడ్డులోని మరళి రిసార్ట్స్ లో ఈ పెళ్లి జరగనుంది. ఈ మేరకు ఆహుతులకు శుభలేఖలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇరువైపులా బంధువులకు శుభపత్రికలు అందిస్తున్నారు. రాధా, పుష్పవల్లి పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాధా వివాహానికి రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు హాజరు కానున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె అయిన పుష్పవల్లితో రాధా ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగింది. జక్కం అమ్మాని 1987-92 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్గా బాధ్యతలు నిర్వహించారు. ఇక పుష్పవల్లి. స్కూల్, కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. అనంతరం హైదరాబాద్లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొంతకాలం హైదరాబాద్లో యోగా టీచర్గా పనిచేసిన పుష్పవల్లి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు.
వంగవీటి మోహనరంగ కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చారు వంగవీటి రాధా. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆయన.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి .. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం రాధ టీడీపీలో ఉన్నారు.