వరంగల్‍ జిల్లాల్లో టీచర్‍ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా పోలింగ్‍

 వరంగల్‍ జిల్లాల్లో టీచర్‍ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా పోలింగ్‍
  • ఉమ్మడి వరంగల్‍ జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​
  •  టీచర్‍ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా పోలింగ్‍ 
  • ఓటింగ్‍ సరళి పరిశీలించిన కలెక్టర్లు, పోలీస్‍ ఉన్నతాధికారులు 

వరంగల్‍, వెలుగు: వరంగల్‍, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓరుగల్లులో ఓట్లు వేసేందుకు టీచర్లు ఉదయం నుంచే పోలింగ్‍ స్టేషన్లకు పోటెత్తారు. దీంతో 90 శాతానికిపైగా ఓటింగ్‍ నమోదైంది. మూడు ఉమ్మడి జిల్లాలు, సిద్దిపేటతో కలిసి 191 మండలాల్లో మొత్తంగా 25,797 టీచర్‍ ఓట్లు ఉండగా, ఉమ్మడి వరంగల్‍ ఆరు జిల్లాల్లో అత్యధికంగా 11,189 ఓట్లున్నాయి. 

ఇందులో పురుషులు 6763 మంది, మహిళ ఓటర్లు 4426 మంది ఉన్నారు. పోలింగ్‍ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్‍ సరళిని ఆయా జిల్లా కలెక్టర్లు, గ్రేటర్‍ పరిధిలో పోలీస్‍ కమిషనర్‍, రూరల్‍ జిల్లాల్లో ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన పోలింగ్‍ ప్రశాంతంగా ముగిసింది. 

జనగామలో 945 ఓట్లు పోలయ్యాయి..

జనగామ: జనగామ జిల్లాలో 12 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1002 మంది ఓటర్లు ఉండగా, 945 ఓట్లు పోలయ్యాయి. తరిగొప్పుల మండలంలో 16, జఫర్​ఘడ్​లోని 29 మంది ఓటర్లు ఉండగా, 100 శాతం ఓట్లు పోలయ్యాయి. జనగామ గవర్నమెంట్​ బాలికల జూనియర్​ కాలేజీ కేంద్రంలో 511 ఓట్లు ఉండగా, 481 ఓట్లు పోలయ్యాయి. 

జనగామ, లింగాల ఘన్​పూర్​ పోలింగ్​కేంద్రాలను కలెక్టర్​రిజ్వాన్​ బాషా షేక్ సందర్శించి, ఎన్నికల సరళిని పరిశీలించారు. స్టేషన్​ ఘన్​పూర్ పోలింగ్​కేంద్రాన్ని అడిషనల్​ కలెక్టర్ రోహిత్​ సింగ్​పరిశీలించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్​ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాల మధ్య బ్యాలెట్​ బాక్స్​లను నల్గొండలోని స్ట్రాంగ్​రూంకు తరలించారు.  

మానుకోటలో పోలైన ఓట్లు 1571..

మహబూబాబాద్: మహబూబాబాద్​ జిల్లాలో 16 పోలింగ్​బూత్​లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు1663 కాగా, 1571 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో ఆయా పోలింగ్ కేంద్రాలను అడిషనల్​కలెక్టర్ వీరబ్రహ్మచారి పరిశీలించారు.  19 పీవోలు, 19 మంది మైక్రో అబ్జర్వర్లు, 7 రూట్లలో విధులు నిర్వహించారు. 150 మంది పోలీసులతో బందో బస్త్​ను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను జిల్లాఎస్పీ సుధీర్​ రామ్​నాథ్​ కేకన్​ పరిశీలించారు. 

ములుగులో నమోదైన ఓట్లు 583..

ములుగు: ములగు జిల్లాలో ఏర్పాటు చేసిన 9 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్​ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 628మందికి గాను 583మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ములుగు ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్​కేంద్రాన్ని కలెక్టర్​ దివాకర పరిశీలించారు. సీసీ కమాండ్​ కంట్రోల్​ద్వారా ఎన్నికల సరళిని అదనపు కలెక్టర్​ సీహెచ్.మహేదర్​ జీ, ఆర్డీవో వెంకటేశ్​తో కలిసి కలెక్టర్​ పర్యవేక్షించారు. ములుగు మండలంలో 180 మంది, వెంకటాపూర్ లో 35, గోవిందరావుపేట్ లో 102, తాడ్వాయిలో 58, ఏటూరునాగారంలో 44, కన్నాయిగూడెంలో 18, మంగపేటలో 88, వాజేడులో 31, వెంకటాపురంలో 27 ఓట్లు నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. 

కరీంనగర్​ పరిధిలో..

హనుమకొండ/ జయశంకర్​ భూపాలపల్లి : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్​గ్రాడ్యుయేట్, టీచర్స్​ ఎమ్మెల్సీ పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్​ మండలాలతోపాటు వేలేరు మండలం కన్నారం, ఎర్రబెల్లి గ్రామాలల్లో నిర్వహించిన పోలింగ్​లో ఓవరాల్​గా 4,585 మంది గ్రాడ్యుయేట్లు ఉండగా, 3,445 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీచర్స్​ ఎమ్మెల్సీకి నాలుగు మండలాల్లో 166 ఓట్లు ఉండగా, 103 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

భీమదేవరపల్లి మండలంలో 967 మంది ఓటు వేయగా, టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికలో 46 మంది ఓటు వేశారు. ఎల్కతుర్తిలో 751 మంది గ్రాడ్యుయేట్స్​, 28 మంది టీచర్స్​ఓటు వేశారు. వేలేరులో 120 మంది గ్రాడ్యుయేట్స్, మూడు ఓట్లు టీచర్స్, కమలాపూర్​లో 1,607 మంది గ్రాడ్యుయేట్స్, 78 మంది టీచర్స్​ ఓట్లు పోలయ్యాయి. వరంగల్​ సీపీ అంబర్ కిషోర్​ఝా, హనుమకొండ ఆర్డీవో రమేశ్​ రాథోడ్​ ఎల్కతుర్తి పోలింగ్​ కేంద్రాన్ని వేర్వేరుగా సందర్శించారు.​​​​

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో.. 

కరీంనగర్- నిజామాబాద్- మెదక్-ఆదిలాబాద్ టీచర్స్​ పోలింగ్ 92 శాతం, గ్రాడ్యుయేట్​ పోలింగ్​ 76 శాతం జరిగినట్లు కలెక్టర్​ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా పరిధిలోని ఐదు మండలాలైన కాటారం, మహాముత్తారం, మహదేవ్​పూర్, మల్హర్, పళిమలల్లో గ్రాడ్యుయేట్​ ఎన్నికల్లో 1903 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, టీచర్స్​ ఎన్నికల్లో 77 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో పరిధిలో జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్​ ఎన్నికల్లో ​308 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్​ తెలిపారు.