నల్గొండ జిల్లాలో స్పౌజ్​ బదిలీల్లో అక్రమాలు

నల్గొండ జిల్లాలో స్పౌజ్​ బదిలీల్లో అక్రమాలు
  • నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్​లు
  • ఉపాధ్యాయ యూనియన్ల మాటకే చెల్లుబాటు
  • వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ
  • నష్టపోతున్న స్కూల్ అసిస్టెంట్లు, ఎస్​జీటీలు

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో స్పౌజ్​బదిలీల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. వెబ్​ కౌన్సిలింగ్​వల్ల అక్రమాలు వెలుగులోకి రావట్లేదని, కొందరు ఉపాధ్యాయ యూనియన్ల లీడర్లకే విద్యాశాఖ వత్తాసు పలుకుతోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018 గైడ్​లైన్స్​ప్రకారం ఒకేచోట పనిచేస్తున్న భార్యాభర్తలకు స్పౌజ్​వర్తిస్తుంది.

ఈ కోటా కింద బదిలీల్లో అదనంగా పది పాయింట్లు కేటాయిస్తారు. కానీ, జిల్లా బదిలీల్లో మాత్రం చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ఆర్ జేడీ, డీఎస్సీకి ఫిర్యాదు చేశామని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని టీచర్లు వాపోతున్నారు. 'మీ సమస్య తర్వాత చూద్దాం' ముందైతే కొత్త స్కూళ్లలో చేరండి, లేదంటే చర్యలు తప్పవని విద్యాశాఖ ఆఫీసర్లు టీచర్లకు వార్నింగ్​ ఇస్తున్నారు. 

స్సౌజ్​ అక్రమాలు ఇవిగో...

ఫిజికల్​సైన్స్​లో నలుగురు టీచర్లు స్పౌజ్​కింద అప్లై చేసుకున్నారు. నిబంధనల మేరకు ప్రస్తుతం పనిచేస్తున్న సమీప ప్రాంతాల్లోని స్కూళ్లకు బదిలీ కావాలి. కానీ, రూల్స్​కు విరుద్ధంగా స్పౌజ్ క్లయిమ్​చేసుకున్న నలుగురు టీచర్లు సమీప ప్రాంతాల్లో కాకుండా తమకు నచ్చిన మండలాలకు బదిలీ అయ్యారు. ఈ నలుగురి తీరు వల్ల మొత్తం బదిలీల ప్రక్రియ దెబ్బతిన్నదని టీచర్లు ఆరోపిస్తున్నారు. దీనికి విద్యాశాఖ అధికారులే అసలు సూత్రదారులని,  టీచర్ల సంఘాలను అడ్డంపెట్టుకుని లక్షలు పోగుచేసుకుంటున్నారని, దీంతో అర్హులైన తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కట్టంగూరు మండలానికి చెందిన ఓ టీచర్​స్పౌజ్​కింద అదే మండలంలో పోస్టింగ్​తీసుకోవాలి. కానీ తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి బదిలీ చేశారు. అదే మండలంలో పనిచేస్తున్న మరో టీచర్ తిప్పర్తి మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. ఇదే మండలానికి చెందిన మరో టీచర్​ఏకంగా నల్గొండ మండలం దోమలపల్లి స్కూల్​కు పోస్టింగ్​ఇచ్చారు. నిజానికి కట్టంగూరు మండలంలో ఈదులూరు, పరడ స్కూళ్లలో ఫిజికల్​సైన్స్​పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఒక టీచర్ భర్తది కురుమర్తి కాగా, అదే మండలంలోనే స్పౌజ్​వర్తింపచేయాలి.

లేదంటే నకిరేకల్, నార్కట్​పల్లి మండలాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిన్నింటినీ కాదని రూల్స్ కు​వ్యతిరేకంగా తమకు నచ్చిన స్కూల్స్ లో అధికారులు పోస్టింగ్​లు కట్టబెట్టారు. ఇక అన్నెపర్తి స్కూల్​లో పనిచేసే ఓ టీచర్ భర్త మునుగోడు మండలం కిష్టాపురం స్కూల్​లో పనిచేస్తున్నారు. స్పౌజ్​కింద సదరు టీచరు మునుగోడు మండలంలోని కొంపల్లి, ఊకొండి దగ్గర​లో పోస్టింగ్ ఇవ్వాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా నేషనల్​హైవే మీదున్న చిట్యాల మండలంలో పోస్టింగ్​ఇచ్చారు. దీంతో మునుగోడు మండలంలో పనిచేస్తున్న టీచర్​కు తీరని అన్యాయం జరిగింది.

ఈ టీచర్​భార్య ఎస్​జీటీ. ఆమె సౌలభ్యం కోసమని అతను స్పౌజ్​వాడుకోలేదు. స్పౌజ్​ కింద తన భార్యకు చిట్యాల లేదా కట్టంగూరు మండలంలో పోస్టింగ్​వస్తే, తనకు చిట్యాల మండలంలో పోస్టింగ్​ వస్తదని భావించారు. కానీ అన్నెపర్తిలో పనిచేసే టీచర్​చిట్యాలకు రావడంతో మునుగోడులో పనిచేసే సదరు టీచర్​మరో గత్యంతరం లేక నకిరేకల్​మండలం చందుపట్లకు రావాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తన భార్యకు ఎక్కడ పోస్టింగ్​వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కనగల్​మండల కేంద్రంలో పనిచేస్తున్న ఓ టీచర్​ భర్త నల్గొండలో వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్నారు.

ఈ టీచర్​స్పౌజ్​కింద నల్గొండ లేదంటే తిప్పర్తి మండలంలో పోస్టింగ్​దక్కాలి. కానీ కట్టంగూరు మండలంలోని నలుగురు టీచర్లు నల్గొండ రూరల్, తిప్పర్తి మండలంలోకి అక్రమంగా చొరబడటంతో సదరు టీచర్​కు గత్యంతరం లేక మళ్లీ కనగల్​మండల కేంద్రం నుంచి మారుమూల ప్రాంతమైన చిన్నమాదారం స్కూల్​ కు వెళ్లాల్సి వచ్చింది. స్పౌజ్ కింద ఒకే రేడియస్​లో పనిచేయాల్సిన భార్యాభర్తలు అధికారుల నిర్వాకంతో దూరప్రాంతాలకు బదిలీ అవుతున్నారు.