
హైదరాబాద్ : ఉపాధ్యాయుల స్పౌజ్ (దంపతుల) క్యాటగిరీ బదిలీలపై రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో స్థానికులకు మాత్రమే స్పౌజ్ బదిలీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. PRTU నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు అక్రమంగా బదిలీలు లేకుండా చూడాలని మంత్రి సబితను ఉపాధ్యాయులు కోరారు.
మరోవైపు.. ఉపాధ్యాయుల స్పౌజ్ క్యాటగిరీ బదిలీలకు రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈనెల 26న రాష్ర్ట విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5 జారీ చేశారు. బదిలీల ప్రక్రియను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా, పదోన్నతుల ప్రక్రియను మాన్యువల్గా చేపట్టనున్నారు. క్యాటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన సూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలను ఇవాళ ఆన్లైన్లో ప్రకటిస్తారు. ఈ నెల 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల హార్డ్కాపీలను ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2లోపు అందజేయాల్సి ఉంటుంది. వీటిని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలి.