హనుమకొండ/కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్ లో మూడు రోజుల పాటు కొనసాగిన టెక్నోజియాన్ వేడుకలు ఆదివారం ముగిశాయి. దేశంలోని వివిధ సాంకేతిక విద్యాసంస్థల నుంచి తరలివచ్చిన స్టూడెంట్లుతమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఇంజీనియస్ థీమ్ తో సాగిన ఉత్సవాల్లో విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలు అందరినీ ఆలోచింపజేశాయి. మూడో రోజు మైండ్స్ ఇన్ ద మెషీన్, వెహికల్ డెమాన్ స్ట్రేషన్, పోస్టర్ స్పెక్ట్రమ్, బిడ్ క్రాఫ్ట్, మైండ్ గ్రైండ్, వరంగల్ ట్రేడింగ్ రింగ్ తదితర ఈవెంట్లు నిర్వహించారు.
రోబోటిక్, నిట్ విద్యార్థులు తయారు చేసిన స్పర్ధక్ వెహికిల్ ప్రదర్శన ఆకట్టుకుంది. మూడో రోజు ఉత్సవాలకు ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ టీఎన్ సురేశ్ కుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఐఐటీ, ఎన్ఐటీల స్టూడెంట్లు స్పెస్ రిసెర్చ్లు చేయాలని సూచించారు. ఆ దిశగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక అభివృద్ధిలో కమ్యూనికేషన్దే ప్రధాన పాత్ర అన్నారు. స్పేస్ రిసెర్చ్ గురించి అవగాహన పెంచుకోవడానికి ఇస్రోకు రావాలని స్టూడెంట్లను ఆయన ఆహ్వానించారు. కాగా, ఈ మూడు రోజుల సాంకేతిక ఉత్సవంలో రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.