హనుమకొండ బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో MLC తీన్మార్ మల్లన్న కీలక కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ పార్టీని బీసీలకు కొనే స్థోమత ఉందంటూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గానికి చెందిన వారు ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి ఇస్తుంటే .. బీసీల అభివృద్దికి కేవలం 9 వేల కోట్ల రూపాయిలనే కేటాయించారని మండిపడ్డారు. తెలంగాణ ఉన్న ఓటర్లు బీసీలేనని.. ఇతర కులాల వారు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని తీన్మార్ మల్లన్న అన్నారు. పిరికెడు మంది లేని వారు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ.. ఇక అలా ఉండటానికి వీల్లేదు.. నిన్నటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒకలెక్క. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదు. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. ఇకపై రెడ్డి, వెలమలకు మాకు విడాకులే. దానికి ఈసభే వేదికన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనన్న ఎమ్మెల్సీ మల్లన్న ..2028లో వచ్చేది బీసీల రాజ్యమేనని తేల్చి చెప్పారు. బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయకపోతే.. ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితులను కల్పిస్తామన్నారు.