కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది: మంత్రి పొంగులేటి

కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది: మంత్రి పొంగులేటి

కరీంనగర్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పదేళ్ల పాలనపై ధ్వజమెత్తారు.  కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో  ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ గా పేరు మార్చి పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకున్నారన్నారు.  అధికారంలో ఉన్న పదేళ్లలో కేంద్రం నుంచి సరైన నిధులు తేలేకపోయారని ఎద్దేవా చేశారు.

ధనిక తెలంగాణను అప్పుల పాలు చేశారని, ఏడు లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అరాచకాలను కేసీఆర్ పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇరిగేషన్, విద్యుత్ సంస్థల్లో కేసీఆర్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులకు వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ త్వరలోనే పేకమేడ లాగా కూలిపోతుందన్నారు.

రైతుబంధు నిధులను రుణమాఫీ కోసం వాడామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతు భరోసా రైతులకు ఇచ్చి తీరుతామని చెప్పారు. ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కేసీఆర్ లాగా రుణమాఫీకి పదేళ్ల సమయం తీసుకోలేదని.. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని తెలిపారు. వాస్తవాలను బిఆర్ఎస్ నేతలు ఇంకా ఒప్పుకోవడం లేదని, కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకుల మాదిరి గొప్పలకు వెళ్లడం లేదని ఉద్ఘాటించారు.