
- దావోస్లో రికార్డు పెట్టుబడులు సాధించాం: మంత్రి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ అని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దావోస్ లో రికార్డు స్థాయిలో 1.76 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ఆయన చెప్పారు. శుక్రవారం హైటెక్స్ లో ఎకనామిక్ టైమ్స్ ఏస్ టెక్ ఎగ్జిబిషన్ ను మంత్రి కోమటిరెడ్డి చీఫ్ గెస్ట్ గా ప్రారంభించి మాట్లాడారు.
తెలంగాణ దశ, -దిశను మార్చే సూపర్ గేమ్ చేంజర్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేయబోతున్నామని, నార్త్ పార్ట్ కు ఇప్పటికే కేంద్రం టెండర్లు పిలిచిందని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, మెట్రో విస్తరణ, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఇలా ఎన్నో కొత్త ప్రాజెక్టులను తమ ప్రభుత్వం నిర్మిస్తోందని వెల్లడించారు. టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో 65 ఐటీఐలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. న్యాక్ ద్వారా ఇజ్రాయెల్, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.