
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ, ఏపీ సభ్యులెవరూ రాకపోవడంతో కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ) రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) ఐదో సమావేశం మళ్లీ వాయిదా పడింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూ ల్ కర్వ్స్ (ఆపరేషన్ అండ్ ప్రొటోకాల్), పవర్ జనరేషన్, ప్రాజెక్టులన్నీ నిండి నీళ్లు సముద్రంలోకి పోతున్న రోజుల్లో ఉపయోగించిన నీటిని ఆయా రాష్ట్రాల కోటాలో వేయాలా.. వద్దా.. అనే అంశంపై చర్చించి బోర్డుకు సిఫార్సు చేయడానికి ఆరుగురు సభ్యులతో ఆర్ఎంసీ ఏర్పాటు చేశారు. మొదట్లో నిర్వహించిన రెండు సమావేశాలకు తెలంగాణ డమ్మా కొట్టగా, తర్వాతి రెండు మీటింగ్లకు అ టెండ్ అయ్యింది. అప్పటికే రూల్ కర్వ్స్, పవర్ జనరేషన్పై కొన్ని నిర్ణయాలు తీసుకోవడాన్ని తెలంగాణ తప్పుబట్టింది. మూడు, నాలుగో సమావేశాల్లో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆర్ఎంసీ రికమండేషన్స్లో చేర్చకపోతే నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ తేల్చిచెప్పింది. ఆర్ఎంసీ ఐదో సమావేశం కోసం ఇప్పటికే పలుమార్లు డేట్ ఫిక్స్ చేయగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నది. సోమవారం నిర్వహించాల్సిన మీటింగ్ వాయిదా వేయాలని ఏపీ అధికారులు బోర్డుకు శుక్రవారమే లేఖ రాశారు. తమ సూచనలను నివేదికలో చేర్చకపోతే సమావేశానికి రాబోమని ఇప్పటికే తెలంగాణ అధికారులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో నవంబర్ రెండో వారంలో రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులనే తేదీ అడిగి, అందరికీ ఆమోదయోగ్యం ఉన్న రోజున భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే వారంలో వైజాగ్కు బోర్డు టీం
వైజాగ్లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ను పరిశీలించడానికి కేఆర్ఎంబీ టీం వచ్చే వారం అక్కడికి వెళ్లనుంది. కృష్ణా బోర్డును వైజాగ్లో ఏర్పాటు చేయడానికి రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వైజాగ్లోని ఐఈఐ బిల్డింగ్లో అద్దె ప్రాతిపదిక కేఆర్ఎంబీ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని ఏపీ ఈఎన్సీ గతంలోనే బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. ఈనేపథ్యంలో బోర్డు టీం ఆ భవనా న్ని పరిశీలించి ఆఫీస్ ఏర్పాటుకు అనువుగా ఉం దా.. లేదా.. అనే దానిపై నివేదిక ఇవ్వనున్నారు.
నేడు ఎన్డబ్ల్యూడీఏ మీటింగ్
గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానంపై నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) సమావేశం మంగళవారం బెంగళూరులో నిర్వహించనున్నారు. ఎన్డబ్ల్యూడీఏ డీజీ భోపాల్సింగ్ అధ్యక్షతన నిర్వహించే ఈ భేటీలో ఏపీ, తెలంగాణ, చత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కర్నాటక అధికారులు, ఇంజినీర్లు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి ఈఎన్సీ (జనరల్) మురళీధర్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్ హైదరాబాద్ నుంచి వర్చువల్గా పాల్గొననున్నారు. గోదావరి, కావేరి అనుసంధానంపై వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ఎన్డబ్ల్యూడీఏ.. తుపాకులగూడెం (సమ్మక్కసాగర్) నుంచి రివర్ లింకింగ్ చేపట్టాలని నిర్ణయించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఇచ్చంపల్లి మధ్యలో గోదావరి నదిలో 324 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఇందులో చత్తీస్గఢ్ రానున్న 20 ఏండ్లలోనూ ఉపయోగించుకోలేని నీళ్లు 147 టీఎంసీలు ఉన్నాయని లెక్క తేల్చారు.
సీడబ్ల్యూసీ ప్రశ్నలకు గట్టిగా జవాబియ్యండి: కేసీఆర్
కాళేశ్వరం అడిషనల్ టీఎంసీతో కూడిన డీపీఆర్పై సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) లేవనెత్తే అన్ని ప్రశ్నలకు గట్టిగా జవాబివ్వాలని అధికారులను, ఇంజనీర్లను కేసీఆర్ ఆదేశించారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్సీలు హరిరాం, వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండేతో భేటీ అయ్యారు. అడిషనల్ టీఎంసీ డీపీఆర్పై సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ పెడుతున్న కొర్రీలు ఏమిటి? వాటికి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానాలు చెప్పారనే వివరాలు సేకరించారు. త్వరగా హైడ్రాలజీ, ఫైనాన్స్ క్లియరెన్స్లు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు.