
నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలించకుండా ఏపీని అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ (కేఆర్ఎంబీ)కి బోర్డుకు ఫిర్యాదు చేసింది తెలంగాణ. జలసౌదలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ను తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహులు బొజ్జా ఇ.ఎన్.సి అనిల్ కుమార్ తో పాటు నల్లగొండ జిల్లా సి.ఇ అజయ్ కుమార్ లు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాహుల్ బొజ్జా వాదనలు వినిపించారు.
ఆంద్రప్రదేశ్ కృష్ణా జలాలు అక్రమ వినియోగంపై సమగ్రంగా వివరించారు .వాటాను మించి నీటి వినియోగాన్ని వాడుకుంటున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టడి చెయ్యాలని కేఆర్ఎంబీని కోరారు. శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ నుండి నిబంధనలను ఉల్లంఘించి తరలించుకు పోతున్న నీటిని తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు.
కేఆర్ఎంబీ రికార్డుల ప్రకారమే ఏపీ తనకున్న హక్కులను మించి నీటిని వినియోగించుకుందని చెప్పారు .ఉమ్మడి జలాశయాల నుండి ఏకపక్షంగా నీటిని తరలించుకుని పోయే హక్కు ఆంద్రప్రదేశ్ కు ఎక్కడి దని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంతేగాకుండా 2025 మే వరకు గాను తెలంగాణా రాష్ట్రానికి త్రాగునీరు,సాగునీరు 107 టీఎంసీల నీటి అవసరాన్ని ఆయన వివరంగా చైర్మన్ కు వివరించారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన బోర్డు పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ఈ సమస్య జఠిలంగా మారిందని చెప్పారు రాహుల్ బొజ్జా.