
తెలంగాణ ద్రోహులకు- తెలంగాణ కోసం పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈసారి ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం(అక్టబర్ 24) మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపు మాటలు ప్రజలు నమ్మద్దని.. తెలంగాణ రాష్టం కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపు గొడవలని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ..ధరణి రద్దు చేస్తామని అంటున్నారని, ధరణి వద్దు అని అంటే పటేల్ వ్యవస్థ మళ్ళీ తెచ్చినట్టేనని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ లో సిఎం పోస్ట్ కోసం నలుగురైదుగురు ఉన్నారని.. కానీ, బీఆర్ఎస్ గెలిస్తే కెసిఆరే సిఎం అవుతారని చెప్పారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడం లేదని, అక్కడ కరెంటు కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.
ALSO READ: మేడిగడ్డ బ్యారేజీను పరిశీలిస్తున్న కేంద్ర కమిటీ
పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ టికెట్లు అముకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దొంగకు తాళం చెవులు అప్పగించిందని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులకు.. తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య పోటీ ఉంటుందన్నారు. సంగారెడ్డిలో కచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగారేస్తామాని హరీష్ రావు పేర్కొన్నారు.