
హైదరాబాద్, వెలుగు: భాషపై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి సీతక్క మధ్య గరం గరం సంభాషణ నడిచింది. బుధవారం అసెంబ్లీలో భూభారతి, ఇండ్ల గురించి అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతుండగా.. సీతక్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, తాను చెప్పేది సీతక్కకు అర్థం కావడం లేదంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.
ఆమెకేమో ఉర్దూ, ఇంగ్లిష్ రాదని.. తాను చెప్పేది అర్థం కాదని.. తనకేమో తెలుగు రాదని ఆయన అన్నారు. ‘‘నేను చెప్పేది వారికి అర్థం కాకుంటే సారీ చెప్పడం తప్ప నేను చేసేదేమీ లేదు” అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారే తప్ప తాము ఏమేం ఇచ్చామో మాత్రం తెలుసుకోలేకపోయారని అన్నారు. ‘‘ఔను.. నాకు ఇంగ్లిష్, హిందీ రాదు.. గూడెంలో పుట్టి పెరిగిన. నా మాతృభాష తెలుగు” అని కౌంటర్ ఇచ్చారు.
పోలీస్ వ్యవస్థను మొత్తం కించపరిచేలా ఒవైసీ మాట్లాడుతున్నారని, గత పదేండ్ల కోపాన్ని పదినెలల తమ ప్రభుత్వంపై తీయొద్దని సూచించారు. మళ్లీ ఒవైసీ మాట్లాడుతూ.. తాను మొత్తం పోలీస్ వ్యవస్థను తప్పుబట్టడం లేదన్నారు. ‘‘సీతక్క అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆమె చాలా కష్టపడి పైకొచ్చారు. అయితే, గత ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో రేప్ కేసులు భారీగా పెరిగాయి. కిడ్నాప్లు, నేరాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం కోసం నేను మాట్లాడను. ప్రజల కోసం మాట్లాడుతా” అని అన్నారు. ఇందుకు సీతక్క మళ్లీ కౌంటర్ ఇచ్చారు. గత పదేండ్లలో లక్షకుపైగా నేరాలు జరిగాయని, వాటిని ఎలా నివారించాలో చెప్పాలేగానీ.. ప్రభుత్వంపై నిందలు మోపడం తగదన్నారు. తాను కూడా ప్రజల కోసమే ఆలోచిస్తానని, మహిళలపై జరుగుతున్న నేరాలపై
రిపోర్టులు తెప్పించుకుని రివ్యూ చేస్తున్నామని తెలిపారు.