
- రాష్ట్రంలో 56.33% బీసీ జనాభా ఉంది
- ప్రతి ఏటా ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే
- కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడే బిల్లు
- కలిసి వచ్చిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధాని అపాయింట్ మెంట్ ఇప్పించాలె
- అన్ని పార్టీల వాళ్ల వెళ్లి కలిసి పార్లమెంటులో పెట్టాలని కోరుదాం
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లును శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బడుగులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బడుగుల కోసం పార్టీలకు అతీతంగా ఒక్కటవడం అభినందనీయమని అన్నారు. 2017లో గత ప్రభుత్వం బీసీలకు 37% రిజర్వేసన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని చెప్పారు. ఆ బిల్లును గవర్నర్ కాన్సెంట్ కోసం పంపిందని, గవర్నర్ రాష్ట్ర పతికి పంపారని తెలిపారు.
దానిని ఉపసంహరించుకుంటూ.. కొత్త బిల్లును పంపుతున్నట్టు సీఎం చెప్పారు. 50% రిజర్వేషన్లు మించొద్దనే నిబంధన ఉందని, దానిపై పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరమని సీఎం అన్నారు. ఇందుకోసం మనందరం పార్టీలకు అతీతంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుద్దామని సీఎం చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ ఇప్పించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పార్లమెంటులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలుద్దామని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నించాలని కోరారు.
ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిందని, ఈ ప్రక్రియను గత ఏడాది ఫిబ్రవరి 4 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీ వరకు పూర్తి చేసిందని సీఎం చెప్పారు. ఇందుకోసం ప్రతి ఏటా ఫిబ్రవరి 4న రాష్ట్రంలో సోషల్ జస్టిస్ డే జరుపుకొందామని చెప్పారు. వివాదాలకు తావు లేకుండా ఈ బిల్లు అమలయ్యే వరకు అందరం కలిసి శ్రమిద్దామని సీఎం పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 56.33% బీసీలు
తెలంగాణలో బీసీల లెక్క తేలిందని, రాష్ట్రంలో 56.36% మంది బీసీలు ఉన్నారని సీఎం చెప్పారు. వారికి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లుగా తెచ్చామన్నారు. ఈ తీర్మానం సందర్భంగా చర్చలో పాల్గొని సలహాలు ఇచ్చిన గంగుల కమలాకర్, హరీశ్ రావు, పాయల్ శంకర్, కూనంనేని సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలిపారు.