నేడు ( మార్చి 19 ) రాష్ట్ర బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి

నేడు ( మార్చి 19 ) రాష్ట్ర బడ్జెట్..  అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి
  • రూ.3.10  లక్షల కోట్ల వరకు 2025–26 పద్దు?
  • సొంత రాబడి, భూముల అమ్మకంతో నాన్​ ట్యాక్స్,​ 
  • ట్యాక్స్ ​రెవెన్యూ పెరుగుతుందని అంచనాలు
  • విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రయారిటీ


హైదరాబాద్​, వెలుగు: రైతు భరోసా, రాజీవ్​ యువ వికాసం, ఇతర ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పూర్తిస్థాయి బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయ్యింది. ఇప్పటికే 14  నెలలపాటు ఆదాయ, వ్యయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రభుత్వం.. ఆ మేరకే పద్దును పెట్టేందుకు సిద్ధమైంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఉదయం 11.02 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్​ను  ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు సమర్పించనున్నారు.  

ఈ మేరకు బడ్జెట్​కు  ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అసెంబ్లీ లాబీల్లోని కమిటీ హాల్​లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై.. ఆమోదం తెలుపనున్నది. రూ.3.10  లక్షల కోట్ల  వరకు పూర్తిస్థాయి బడ్జెట్​ను పెట్టనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇంకాస్త ఎక్కువే అనుకున్నప్పటికీ ఆదాయ, వ్యయాల ప్రకారం మార్పులు చేసినట్టు తెలుస్తున్నది.  ఈసారి  రాష్ట్ర సొంత ఆదాయాన్ని ప్రభుత్వం ఎక్కువగా చూపనున్నది. వివిధ మార్గాల్లో వస్తున్న రాబడిని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం, గతంలో ఉన్న లూప్స్​ను అరికట్టడంతో ఆదాయం పెరిగింది. 

ఎల్ఆర్ఎస్​, 58,59 జీవోల క్లియరెన్స్​, ఎక్సైజ్​ పాలసీ, భూముల ధరల సవరణ వంటి వాటితో ఇన్​కమ్​ పెరగనున్నది. ఇక నాన్​ ట్యాక్స్​ రెవెన్యూను కూడా ఎక్కువగా అంచనా వేస్తున్నారు. ఇందుకు టీజీఐఐసీ, హెచ్ఎండీఏ భూములు తనఖా పెట్టి, వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం లోన్లు తీసుకోనున్నది. కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో రూ.35,028 కోట్లు నాన్​ ట్యాక్స్​ ఆదాయం పెట్టుకున్నది. అయితే, ఈసారి ఈ మొత్తం కొంత పెంచనున్నట్టు తెలుస్తున్నది. 2024–25 రాష్ట్ర బడ్జెట్​లో  కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్ల కింద రూ.21,636 కోట్లు వస్తాయని ఆశించగా.. కేవలం రూ.6 వేల కోట్ల వరకే వచ్చాయి.  దీంతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్​ఇన్​ఎయిడ్​ ను ఈ బడ్జెట్​లో కొంతమేర తగ్గించుకోనున్నది.  

విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యం

ఈ బడ్జెట్​లోనూ విద్య, వైద్యంతోపాటు వ్యవసాయం, సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదే సమయంలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెరుగనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పంచాయతీరాజ్​ శాఖకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేయనున్నట్టు తెలిసింది. ఇక వ్యవసాయంలో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు,  రైతు బీమా, పంటల బీమాకు రూ.7 వేల కోట్లు కేటాయించనున్నది. 

ఆ తర్వాత ఎడ్యుకేషన్​కు కూడా మంచి కేటాయింపులు ఉంటాయని తెలుస్తున్నది. ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్స్​కు నిధులు ఇవ్వనున్నారు. ఇరిగేషన్​కు కూడా రూ.26 వేల కోట్లకు పైనే కేటాయించనున్నది. మూసీ రివర్​ఫ్రంట్​, రీజినల్​ రింగ్​ రోడ్డు, ఫ్యూచర్​ సిటీకి  కూడా బడ్జెట్​లో నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. 

పీఆర్సీ, డీఏలు, కొత్త ఉద్యోగాలు

పీఆర్సీ ప్రకటన, డీఏలు ఇవ్వడం, కొత్త ఉద్యోగాల రిక్రూట్​మెంట్​తో పాటు జీత భత్యాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీలకు అవసరమైన మేరకు కేటాయింపులు చేయనున్నారు. జీఎస్డీపీలో 3 శాతం అప్పుల రూపంలో సమకూరుతాయి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ  రూ.2 లక్షల కోట్లు   వస్తుందని అంచనా వేస్తున్నారు. 

నాన్​ట్యాక్స్ రెవెన్యూ కూడా రూ.35 వేల కోట్ల పైన రాబట్టుకోవాలని ప్రతిపాదనలు చేశారు. గ్రాంట్​ఇన్​ ఎయిడ్​ కింద రూ.15 వేల–రూ. 20 వేల కోట్లు పెట్టనున్నట్టు తెలుస్తున్నది. ఇక అప్పులు రూ.60 వేల కోట్ల పైనే  తీసుకోనున్నారు.  ఇతరత్రా అన్నీ కలిపితే ఈ సారి  బడ్జెట్​ రూ.3.10  లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నది.