రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు

రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు

హైదరాబాద్: అసెంబ్లీలో మూడోసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతులకు ఏడాదికి ఎకరానికి 12 వేల రూపాయలు అందుతాయని ఈ సందర్భంగా భట్టి తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి.. రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద పీట వేసింది. వ్యవసాయ శాఖకు బడ్జెట్లో 24 వేల 439 కోట్లు కేటాయించారు.

రాష్ట్రంలో మూడెకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే. రూ.1,230.98 కోట్లను రైతుల అకౌంట్లలో వేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి. జనవరి 26న పైలెట్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి రూ.568.99 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న 17 లక్షల మంది రైతులకు చెందిన 9.29 లక్షల ఎకరాల భూమికి గాను రూ.557.54 కోట్లు జమ చేశారు.

రెండెకరాల వరకు ఉన్న రైతులకు ఫిబ్రవరి 10న 13.23 లక్షల మందికి, ఫిబ్రవరి 12న రికార్డులు అప్‌‌‌‌డేట్ చేసిన 56 వేల మంది రైతులకు రూ.38.34 కోట్లతో కలిపి మొత్తం రూ.1,130.29 కోట్లు నిధులు జమ చేశారు. అదే రోజు మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మంది రైతులకు చెందిన 20.51 లక్షల ఎకరాలకు రూ.1,230.98 కోట్లు నిధులను డైరెక్ట్​ బెనిఫీషియరీ ట్రాన్స్‌‌‌‌ఫర్ ద్వారా రైతు ఖాతాల్లో వేశారు. 

Also Read:-58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. 11 వేల 600 కోట్ల నిధులు..

దీంతో ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద రూ.3,487.82 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్లో రైతు భరోసాకు 18 వేల కోట్లు కేటాయించడంతో రేపోమాపో రైతు భరోసా అర్హులైన లబ్దిదారులకు అందనుంది.