
- నేడు వివిధ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోకు చేరుకుంది. ఈ టీమ్కు భారత రాయబారి శిబు జార్జ్ స్వాగతం పలికారు. 100 ఏండ్ల చరిత్ర కలిగిన ‘ఇండియా హౌస్’లో బుధవారం రాత్రి డిన్నర్ ఇచ్చారు. డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్, అధికారులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి డిన్నర్లో పాల్గొన్నారు.
గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్, వివిధ సంస్థలతో సీఎం సమావేశం కానున్నారు. తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ఈ టూర్లో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను సీఎం ప్రారంభించనున్నారు.