
- సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే: సీఎం రేవంత్
- ఆన్లైన్ బుకింగ్లో మార్పులు.. ప్రతి రీచ్ దగ్గర 360 డిగ్రీల కెమెరాలు
- ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలి
- గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా, సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇసుక మాఫియాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. ఆ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించబోమని, అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు.
వెహికల్స్కు ట్రాకింగ్ సిస్టమ్
ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు చేంజెస్ చేయాలని, ఆఫీస్ టైమింగ్స్లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళలను మార్చాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని, అందుకు జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతి రీచ్ దగ్గర 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలన్నారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేయాలని సూచించారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని, ప్రాంతాలవారీగా సమీప రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థ ఏర్పడాలని అన్నారు. సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించాలని, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు.