
తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన ఆయన తన ఓటు వేశారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రానికి రాని చింతమడక ఓటర్లు..కేసీఆర్ రాగానే భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన సీఎం ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం కేసీఆర్ దంపతులు హైదరాబాద్ కు బయలదేరారు. కేసీఆర్ దంపతుల వెంట మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు.
మరోవైపు రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు 20.64 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు . అత్యధికంగా అదిలాబాద్ లో 30. 65 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లో 12.39 శాతం నమోదైంది. మధ్యాహ్నం తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఈసీ భావిస్తోంది.