
- మెదక్ నుంచే కేసీఆర్ ప్రచారం
- నేడు బహిరంగ సభ.. మంత్రి హరీశ్ వెల్లడి
- మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యం
- కేసీఆర్ వ్యూహంతో ప్రతిపక్షాలు కకావికలం
- బీజేపీ డీలా... కాంగ్రెస్ది ఉత్త గోల అని కామెంట్లు
మెదక్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మెట్టమొదటి బహిరంగ సభ బుధవారం మెదక్ లో నిర్వహిస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సభ నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి శంఖం పూరిస్తారని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎన్నికలకు చాలా రోజుల ముందు ఒకేసారి వంద మందికిపైగా అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర బీఆర్ఎస్కు తప్ప మరే పార్టీకి లేదని అన్నారు. అభ్యర్థుల ఖరారుతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నదని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభిస్తున్నదని పేర్కొన్నారు.
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంగళవారం హరీశ్రావు మెదక్ చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సారి 10కి 10 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత వ్యూహాన్ని ఏ పార్టీ ఊహించలేదని, ఒకేసారి అభ్యర్థుల ప్రకటనతో ప్రతిపక్షాలు కకావికలం అయ్యాయని అన్నారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా డీలా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీది ఉత్త గోల మాత్రమే. ప్రతిపక్షాల గ్లోబెల్స్ ప్రచారంతో ప్రజల మనసు గెలవలేరు. ఎవరు అవాకులు, చెవాకులు పేలినా ఎవరూ పట్టించుకోరు” అని హరీశ్ అన్నారు.
ఇదీ సీఎం పర్యటన షెడ్యూల్
సీఎం కేసీఆర్ బుధవారం మెదక్లో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ ఆఫీస్ను ఆయన ఓపెన్ చేస్తారు. దివ్యాంగులకు పెంచిన పింఛన్లు, టేకేదార్లకు ఆసరా పింఛన్లను మెదక్ నుంచే ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేసీఆర్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి రోడ్డు మార్గంలో వయా నర్సాపూర్ మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు మెదక్ చేరుకుంటారు. ముందుగా బీఆర్ఎస్ బిల్డింగ్ను ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.20 గంటలకు ఎస్పీ ఆఫీస్ను, 1.40 గంటలకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్ ను ఓపెన్ చేస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు కొత్త కలెక్టరేట్లో పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తారు. ఆపై జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల సీఎస్ఐ గ్రౌండ్లో జరిగే ప్రగతి నివేదన సభలో ప్రసంగిస్తారు. మంత్రి హరీశ్ రావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, బహిరంగ సభా స్థలిని పరిశీలించి.. కలెక్టర్, ఎస్పీ, అధికారులకు తగు సూచనలు చేశారు.