
- ప్రపంచ దేశాలకు ఎగుమతుల కేంద్రంగా తెలంగాణను ఎంచుకోండి
- జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానం
- ఒసాకా ఎక్స్ పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: జపాన్తో తెలంగాణకు మంచి సంబంధాలు ఉన్నాయని, కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘హైదరాబాద్కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణ ను గమ్యస్థానంగా ఎంచుకోండి..’’ అని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్ వేదికగా ఆయన వివరించారు. ఒసాకా వరల్డ్ ఎక్స్ పోలో సోమవారం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్ పోలో భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామన్నారు. స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ ఆహ్వానించారు.
30వేల ఎకరాల్లోఫ్యూచర్ సిటీ: మంత్రి శ్రీధర్బాబు
ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ రంగాల పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను ఆయన వివ రించారు. హైదరాబాద్ లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని.. ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీపై ఈ సిటీ ఆధారపడుతుందని చెప్పారు. జపాన్కు చెందిన మారుబెని కార్పొరేషన్తో ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లతో పాటు ట్రిపుల్ ఆర్కు ఓఆర్ఆర్ మధ్య ఉన్న జోన్లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని చెప్పారు. ఎగుమతులకు వీలుగా సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే అభివృద్ధి చేసేందుకు టోక్యో, ఒసాకా నగరాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్యత, క్రమ శిక్షణకు అద్దం పట్టేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.
తెలంగాణ పెవిలియన్ ప్రారంభం
జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ తన ప్రత్యేకమైన పెవిలియన్ను ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్ కు అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రతి ఐదేండ్లకోసారి ఒసాకో ఎక్స్ పో నిర్వహిస్తారు. తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.