హైదరాబాద్, వెలుగు: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు సీఎం బేగంపేట నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి మంగళగిరి వెళ్లి తిరిగి రాత్రి 7 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మంత్రులను ఇటీవల హైదరాబాద్లో కలిసిన విషయం తెలిసిందే. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆమె వారిని ఆహ్వానించారు. కాగా.. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తోంది.