
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీ పొలిటికల్అఫైర్స్ కమిటీ(పీఏసీ)లో సోమవారం చర్చ జరిగింది. పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ నేతృత్వంలో జూమ్యాప్లో పీఏసీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ విషయంలో ఆ జిల్లా నాయకులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేపటిలోగా అన్ని జిల్లాల నాయకులు చర్చించుకుని సమగ్ర సమాచారాన్ని పీసీసీ అధ్యక్షులకు, సీఎల్పీ నాయకులకు, మండలి ఎన్నికల కమిటీ సభ్యులకు తెలియజేయాలని చెప్పారు. ప్రజాచైతన్య యాత్ర వారం రోజుల పాటు వాయిదా పడినందున ఆ సమయంలో జిల్లాలో డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. ఆయా జిల్లాల ఇన్చార్జిలుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్స్ జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రులు బలరాం నాయక్, రేణుక చౌదరి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు పాల్గొన్నారు.