అధ్యక్ష పోస్టులకు పోటాపోటీ

అధ్యక్ష పోస్టులకు పోటాపోటీ
  • కాంగ్రెస్​లో తమ వర్గం వారికే ఇవ్వాలని పట్టుబడుతున్న ఎమ్మెల్యేలు
  • లీడర్ల చుట్టూ తిరుగుతున్న ఆశావహులు
  • పాలమూరు, వనపర్తి జిల్లాల అధ్యక్షులను ఖరారు చేసిన బీజేపీ
  • గద్వాల, నారాయణపేట, నాగర్​కర్నూల్​ పోస్టులుపెండింగ్

మహబూబ్​నగర్, వెలుగు: ప్రధాన పార్టీల జిల్లా అధ్యక్ష పోస్టుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. లోకల్​ బాడీ ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో ఈ పోస్టులను భర్తీ చేయాలని పార్టీల హైకమాండ్​లు భావిస్తుండగా.. లీడర్లు మాత్రం వర్గాలుగా విడిపోయి తమ మద్దతుదారులకే ఈ పోస్టులను ఇవ్వాలనే డిమాండ్​ను తెరమీదకు తీసుకొస్తున్నారు. 

హాట్ ​కేకుల్లా డీసీసీ పోస్టులు..

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడంతో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం  పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కొత్త డీసీసీలను నియమిస్తారనే చర్చ జరిగినా, పార్లమెంట్​ ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. కొద్ది నెలల కిందట టీపీసీసీ చీఫ్​ పోస్టును హైకమాండ్​ భర్తీ చేసినా.. డీసీసీలను పెండింగ్​లోనే పెట్టింది.

 అయితే నెలాఖరులోగా స్థానిక సంస్థల​ ఎన్నికలకు షెడ్యుల్​ వెలువడుతుందనే ప్రచారం జరుగుతుండడంతో, ఆ లోపు ఈ పోస్టులను భర్తీ చేయాలని హైకమాండ్​ భావిస్తోంది. కానీ, ఒక్కో జిల్లాలో ముగ్గురు నుంచి నలుగురు చొప్పున డీసీసీ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న లీడర్ల పంచన చేరి ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనికితోడు కొందరు ఎమ్మెల్యేలు తమ వర్గంలో లీడర్​కే అధ్యక్ష పోస్టు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్​ వార్​ నడుస్తున్నట్లు టాక్​ కూడా ఉంది. ప్రధానంగా మహబూబ్​నగర్​ డీసీసీ పోస్టు కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. తమ వర్గం లీడర్లకే అధ్యక్ష పోస్టు ఇవ్వాలని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. 

వీరితో పాటు ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు కూడా చాన్స్​ ఇవ్వాలని ఎన్పీ వెంకటేశ్, సంజీవ్​ ముదిరాజ్, సిరాజ్​ ఖాద్రి తదితరులు టైం వచ్చినప్పుడుల్లా తమ వాణి వినిపిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఎంఎస్ఎన్​ ఫార్మా కంపెనీల అధినేత మన్నే జీవన్​రెడ్డి పేరు తెరమీదకు వస్తోంది. ఆయన రేవంత్​రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో.. దాదాపు డీసీసీ పోస్టు కన్ఫాం అవుతుందనే టాక్​ నడుస్తోంది. దీనికితోడు పార్టీ లీడర్లు ఆయన పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.

వనపర్తి డీసీసీ స్థానాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయిస్తారనే టాక్​ నడుస్తోంది. ఇందుకు ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు ఆయన అనుచరుల ద్వారా తెలిసింది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్​ శ్రీనివాస్​ గౌడ్​ కూడా తనకు చాన్స్​ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన మేఘారెడ్డి, చిన్నారెడ్డిలకు అనుకూలంగా ఉండడం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. 

నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ప్రశాంత్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈయన మక్తల్​ అసెంబ్లీ టికెట్​ ఆశించగా.. హైకమాండ్​ డీసీసీ పోస్టు ఇచ్చి బుజ్జగించింది. అయితే ఈ టర్మ్​ కూడా ఆయన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే సీఎం రేవంత్​ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్​ పరిధిలోని కోస్గి, మద్దూరు మండలాలకు చెందిన లీడర్లు కూడా నారాయణపేట డీసీసీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Also Read :- రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు

నాగర్​కర్నూల్​ కాంగ్రెస్​లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ జిల్లాల్లో అధ్యక్ష పోటీ కోసం ఎవరూ పోటీ పడడం లేదని తెలిసింది. కొందరు మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీల పేర్లు తెరమీదకు వచ్చినా.. వారు ఈ పోస్టు తీసుకునేందుకు ఇంట్రెస్ట్​ చూపడం లేదని తెలిసింది. దీంతోఈ జిల్లాలో అధ్యక్ష పదవికి పోటీ కనిపించడం లేదు. అయితే ప్రస్తుత డీసీసీగా ఉన్న అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను తిరిగి కొనసాగిస్తారా? లేదా కొత్త వారికి చాన్స్​ ఇస్తారా? అనేది సస్పెన్స్​లో ఉంది. 

బీజేపీలో మూడు పోస్టులు పెండింగ్​..


బీజేపీ హైకమాండ్​ రెండు జిల్లాల అధ్యక్షులను నాలుగు రోజుల కింద ప్రకటించింది. ఉమ్మడి జిల్లాల్లో ఐదు జిల్లాలకు గాను మహబూబ్​నగర్​ అధ్యక్షుడిగా శ్రీనివాస్​ రెడ్డి, వనపర్తి అధ్యక్షుడిగా నారాయణ పేర్లను ఖరారు చేసింది. వీరిద్దరికీ రెండోసారి అవకాశం కల్పించింది. అయితే నారాయణపేట, గద్వాల, నాగర్​కర్నూల్​ అధ్యక్షులను ప్రకటించలేదు. 

నారాయణపేట నుంచి సత్య యాదవ్, మక్తల్  నుంచి బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, భాస్కర్, కోస్గి నుంచి ప్రతాప్ రెడ్డి అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు సార్లు అధ్యక్ష పదవులు నారాయణపేట వాసులకే రావడంతో ఈసారి మక్తల్​కు లేదా సీఎం నియోజకవర్గం నుంచి ప్రతాప్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఎంపీ డీకే అరుణ వీరిలో ఎవరికి మద్దతు తెలిపితే వారికే అధ్యక్ష పోస్టు దక్కనుంది.

నాగర్​కర్నూల్​ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎల్లేని సుధాకర్ రావు కొనసాగుతున్నారు. అయితే ఈయన స్థానంలో కొత్త వారిని నియమించేందుకు హైకమాండ్​ కసరత్తు చేస్తున్నా.. జిల్లా స్థాయిలో పరిచయాలు ఉన్న లీడర్లు లేక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.